- మంటలతో భారీగా ఆస్తి నష్టం
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానిక అయ్యప్ప షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మాల్లోని మిగతా అంతస్థులకు చేరాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీ సహాయంతో మాల్ షట్టర్లను తొలగించారు. ఉదయం 7 గంటల వరకు రెండు అంతస్తుల్లో మంటలను అదుపులోకి తీసుకురాగా.. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో రూ.కోట్ల విలువైన సామగ్రి కాలిబూడిదైందని మాల్ నిర్వాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.