- రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావాలి..
- బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే..
- రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివీస్తోంది..
- విలేకరుల సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
చౌటుప్పల్ : ఉప ఎన్నికల్లో మును గోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్న గ్రామాలు తూప్రాన్ పేట్, దండు మల్కాపురం, కొయ్యల గూడెం, దేవలమ్మ నాగారం, పీపల్ పహాడ్, చిన్న కొండూర్, పెద్ద కొండూర్, కుంట్ల గూడెం, నేలపట్ల, జై కేసారం, స్వాములవారి లింగోటం, పంతంగి, గుండ్ల బావి, ఆరెగూడెం గ్రామాలలో విస్తృ తంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని యుద్ధం చేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబం గద్దె దిగాలని బిజెపి పార్టీలో చేరనని ఆ రెండు పార్టీలు ఒకటే కావడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఎంతోమంది యువకుల త్యాగ ఫలంతోనే తెలంగాణ సాధించామని తెలిపారు. కేవలం కేసీఆర్ ఒక్కనితోనే సాధ్యం కాలేదని విమర్శించారు. సోనియాగాంధీ ఇవ్వడం ద్వారానే ఆరోజు తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల వల్ల సంబండ వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. కేసిఆర్ పాలనలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదని అన్నారు. టిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు ఒకటేనని వారికి ఓటేస్తే అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలు మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కార్యక్రమంలో ప్రతి ఏటా రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరి పంటకు 500 రూపాయలు బోనస్, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలం, ఐదు లక్షలు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, యువ వికాస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, చేయూత ద్వారా 4000 రూపాయలు నెలవారి పింఛన్లు,10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. నిత్యం ప్రజల కోసమే, ప్రజల మధ్యనే పనిచేస్తున్నానని తెలిపారు. కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సీనియర్ నాయకులు పబ్బు రాజు ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.