- రోడ్డు ప్రమాద ఘటనలో కేసు నమోదు
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్కు పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటన తర్వాత.. సాహిల్ దుబాయ్ పారి పోయేందుకు మొత్తం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇందులో షకీల్ కూడా తన కొడుకు కోసం సహకరించినట్లు గుర్తించారు. ఇక.. ఇప్పటికే సాహిల్ అలియాస్ రాహిల్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా భవన్ ముందు సాహిల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను తన కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపైనా వేటు వేశారు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. స్టేషన్లోని కెమెరాలను చూశారు. సోహెల్ను స్టేషన్కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు సోహెల్ను తప్పించి అబ్దుల్ ఆసిఫ్ ను నిందితుడిగా చేర్చినట్లు డీసీపీ విజయ్ కుమార్ కు అర్థమైంది. ఆ రోజు నైట్ డ్యూటీలో సీఐ దుర్గారావు, ఏఎస్ఐ విజయ్కాంత్ ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరుపుతున్న సమయంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురికాగా.. అతన్ని కేర్ హాస్పిటల్కు తరలించారు. తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గారావును సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.