- ఎన్నికలపై అధికార వైసిపి కసరత్తు
- ఎన్నికల సంఘం సమీక్షలు పూర్తి
- 7నుంచి ఇసి బృందం పర్యటించే అవకాశం
న్యూఢిల్లీ : ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో అదికార వైసిపి బిజీగా ఉంది. సిఎం జగన్ అబ్యర్థులతో మంతనాలు చేస్తున్నారు. అభ్యర్థులను మార్చేస్తున్నారు. కొందరికి ఏకంగా టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం బృంద సభ్యులు ఇప్పటికే ఎపిలో పర్యటించి సమీక్షలు చేపట్టారు. త్వరలోనే షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఇసి ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటూ ఆంధప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాల్రకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభతో పాటు, తమిళనాడు లోక్ సభకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడి 39 లోక్ సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఆ తరువాత జనవరి 9,10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్దమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలించనున్నారు. జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు గతంతో నిర్వహించినట్లుగా తొలిదశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికల పక్రియ మే 19తో ముగిసింది. ఇందులో దేశ వ్యాప్తంగా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఈసారి దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికలను ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యచరణను రూపొందించి ముందుకు సాగుతోంది.