Thursday, May 2, 2024

పొడిచిన పొత్తు..

తప్పక చదవండి
  • రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా సంచలన పరిణామం
  • చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి
  • జగన్‌కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ
  • బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్‌
  • నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్‌..
  • టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్..

అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు.. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి.. అలాగే వైసీపీ నాయకులు ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుకు సానుభూతి లభిస్తుందని కనుక టీడీపీతో కలిసి పోటీ చేస్తే కనీసం కొన్ని సీట్లైనా సాధించవచ్చని పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.. ఏది ఏమైనా ఈ పరిణామం ఒక సంచలనం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

అమరావతి : ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.. మొన్నటి వరకు టీడీపీతో పొత్తుపై ఆచీతూచీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై కుండబద్దలు కొట్టారు. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోలేదని.. ఆలోచిస్తూనే ఉన్నానన్నారు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.. జనసేన పార్టీ, తెలుగు దేశం కలిసి వెళ్తాయని చెప్పారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్‌కు సంబంధించి కాదని.. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని.. విడివిడిగా పోటీ చేస్తే దశబ్దాలైనా ఇదే అరాచకం కొనసాగుతుందన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని.. సీట్ల పంపకంపై తర్వాత మాట్లాడతానన్నారు. రెండు పార్టీలు కలిసి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

- Advertisement -

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ముగ్గురు నేతలు ప్రత్యేకంగా సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ములాఖత్ రాష్ట్రానికి చాలా ముఖ్యం అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి వెళ్లాలనేది తన కోరిక అని చెప్పారు. ఈ విషయాన్ని పదే, పదే చెప్పాను.. బీజేపీకి కూడా చెప్పాను.. పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని భావించాను అన్నారు. సమిష్టిగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అందరం కలిసి పోటీ చేయాలనేది తన భావన అని వివరించారు. ఈ దుష్ట పాలనను ప్రజలు తీసుకోలేరని.. తాను రోడ్డుపైకి రావడానికి, తెలంగాణ సరిహద్దులో తనను 2వేలమందితో అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా.. జనసేన నేతలు, కార్యకర్తలు ఈ పరిస్థితుల్ని చెప్పాను అన్నారు. తాను ప్రధానిని కలిసిన ప్రతిసారీ జగన్ గురించి చెప్పలేదన్నారు.. ఆయనకు అన్ని విషయాలు తెలుసన్నారు. విశాఖలో ఇబ్బంది పెట్టిన విషయాలు, సినిమాలు ఆపిన సంగతి తెలియదా అన్నారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసన్నారు.

గత నాలుగున్నరేళ్లగా అరాచక పాలన ఎలా ఉందో చూస్తున్నామన్నారు జనసేనాని. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా కేసులు పెట్టి.. చాలా అన్యాయంగా ఆయన్ను రిమాండ్‌కు పంపించడం బాధాకరమన్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చానన్నారు. చంద్రబాబుకు, తనకు గతంలో పాలసీలపరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. తాను విడిగా పోటీ చేశాను.. జనసేన పార్టీ తరఫును తాను రాష్ట్రం బావుంండాలని కోరుకున్నానన్నారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన సమయంలో ఏపీ విభజన తర్వాత రాజధాని లేదు, విభజన సమస్యలు ఉన్నాయన్నారు. యూపీఏ సరైన న్యాయం చేయలేకపోయిందని.. ఆ రోజు నుంచి తాను తీసుకున్న నిర్ణయాలు చాలామందికి ఇబ్బందిగా మారాయన్నారు. 2014లో నరేంద్ర మోదీకి మద్దతు పలికానని.. దక్షిణాది రాష్ట్రాల్లో తాను ముందుకు వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చానన్నారు. దేశానికి బలమైన నాయకత్వం కావాలని తాను కోరుకున్నానని.. అందుకే మోదీకి మద్దతు పలికినట్లు చెప్పుకొచ్చారు. ఆ రోజు తనను అందరూ తిట్టారు.. తాను నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లను అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోదీ పిలిస్తే వెళ్లానని.. టీ, ఫోటోను కూడా అడగను అన్నారు.

2014లో బీజేపీ, టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం.. విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానన్నారు. 2020 విజన్ ఎవరికీ అర్ధం కాలేదని.. మాదాపూర్ వెళితే లక్షలాదిమంది ఉద్యోగులు ఉంటారని.. హైదరాబాద్‌లో ఓ నగరాన్ని చంద్రబాబు నిర్మించారన్నారు. పాలసీలు, అభిప్రాయ బేధాలు ఉండొచ్చని.. కానీ ఆయన మేధస్సు, ఆలోచన తీరు చాలా గొప్పదన్నారు. అప్పుడు తాను కూడా హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనే విభేదించానన్నారు. 2013లో స్కిల్‌డెవలెప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని.. ఈ ప్రాజెక్టులో తప్పులు జరిగితే దానికి సంబంధించిన వ్యక్తులపై విచారణ చేయాలన్నారు. సైబరాబాద్ సిటీని నిర్మించిన వ్యక్తికి రూ.317 కోట్లు స్కామ్ పెట్టి జైల్లో కూర్చోబెట్టడం దారుణమన్నారు. అన్యాయంగా కేసు పెడితే ఎలా అని ప్రశ్నించారు.. ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఆర్థిక నేరాల్లో ఉన్న వ్యక్తి అన్నారు. పాలనపరంగా, పాలసీపరంగా విభేదాలు ఉండొచ్చని.. ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్తా అన్నారు. ఆర్థిక నేరాలతో జైల్లో ఉన్న వ్యక్తి.. ఈడీ కేసులు ఉన్నాయన్నారు. కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లాలని.. అందర్నీ భయబ్రాంతులకు గురి చేసిన వ్యక్తి అన్నారు.
గతంలో డేటా చౌర్యం చేశారన్న వ్యక్తి ఇప్పుడు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి అభియోగాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో డెవలెప్‌మెంట్ ఏం జరిగింది, పరిశ్రమలు ఏవైనా వచ్చాయా, సీపీఎస్ రద్దు చేశారా, రెండున్నరలక్షల ఉద్యోగాలు భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని.. అవినీతి కూరుకుపోయి ఆ బురదను అందరి మీద చల్లుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా చెబితే విభేదించే వారు కూడా ఉంటారు.. ఎవరైనా మాట్లాడితే అడ్డుకుంటున్నారన్నారు. రోడ్డుపైకి రాకూడదు, ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అనడం దారుణమన్నారు.

వీరి బాధను భరించలేక ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని చెప్పానన్నారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటానన్న వ్యక్తి బాధ్యతగా ఉండుంటే బాలయ్య, లోకేష్ మధ్యలో నిలబడి ఉండేవాడిని కాదన్నారు. ఈ పరిస్థితిని జగన్ కల్పించారని.. రోడ్లు లేవు, భూ కబ్జాలు, దోపిడీ చేస్తున్నారు, బెదిరిస్తున్నారన్నారు. అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు.. చంద్రబాబుకు జరిగింది అని కాదు.. రేపు మన ఇంట్లో కూడా జరగొచ్చన్నారు. రోడ్డుపై నిరసన తెలిపితే హత్యాయత్నం కేసు పెట్టారని.. ఎవరూ చట్టానికి అతీతులుకారన్నారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులు అమలు చేస్తారని.. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపే.. యుద్ధం కావాలంటే యుద్ధానికి సిద్ధమే అన్నారు.. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పుల్ని సరిచేసుకుంటే మంచిదన్నారు.

కాగా జైలునుంచి చంద్రబాబును కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ బాబు సతీమణి నారా భువనేవారిని పరామర్శించారు.. వారి కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భయపడవలసిన అవసరం లేదని, క్లీన్ చిట్ తో చంద్రబాబు బయటకు వస్తారని అభయమిచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు