Friday, May 10, 2024

బిఆర్‌ఎస్‌కు కీలకంగా మారిన గజ్వెల్‌

తప్పక చదవండి
  • ఈటెల పోటీతో రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ
  • ప్రచారంలో పలు సమస్యలతో దూసుకుపోతున్న ఈటెల
  • ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న హరీష్‌ రావు

గజ్వెల్‌ : గజ్వెల్‌ నియోజకవర్గం ఇప్పుడు అందరి దీష్టిని ఆకర్శిస్తోంది. ఇక్కడి నుంచి కెసిఆర్‌పై పోటీకి మాజీమంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ రంగంలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. కెసిఆర్‌ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఈటెల దీనిని బాగా ఉపయోగించుకుంటు న్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌ రావు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గజ్వెల్‌ ప్రచారంలో ఆయన బాగా దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్‌ని ఓడిరచడానికి జనం సిద్ధం అయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రచారంలో చెబుతున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో పేదల నుంచి భూములు లాక్కుని ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నారని ప్రచారం ముమ్మరం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తిన వారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా గజ్వేల్‌ ఎన్నికలు జరగాలన్నారు. బెదిరింపులు, ప్రలోభాలు, డబ్బు సంచులు ఇస్తే హుజురాబాద్‌ లో జరిగిన సీనే రిపీట్‌ అవుతుందన్నారు. గజ్వేల్‌ ప్రజలు సీఎం కేసీఆర్‌ ని కసితో ఒడిస్తారన్నారు. పొరపాటున సీఎం కేసీఆర్‌ గెలిస్తే ఒంటిపై ఉన్న బట్టలు కూడా మిగలవని వ్యాఖ్యానించారు. సర్వేకి అందని ఫలితం గజ్వేల్‌ లో రాబోతుందని అంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక.. నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరు విూద లాక్కున్న భూములకు ఇంతవరకు పరిహారం అందించలేదని ఈటల అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీల కోసం పేదల భూములు లాక్కొన్ని కేసీఆర్‌ సర్కార్‌ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోంది. ప్రాజెక్టుల వద్ద టూరిజం పేరుతో మళ్లి భూముల్ని లాక్కుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే లాక్కున్న భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాం. రైతుల నుంచి భూముల్ని లాక్కుని అందులో వారినే కూలీలుగా మారుస్తున్నారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని వారి కోసం కంపెనీలు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు. కేసీఆర్‌ ను మళ్లీ గెలిపిస్తే ప్రజల బతుకులు ఆగం అవుతాయని ఈటల హెచ్చరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మెదక్‌ జిల్లాలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు మంత్రి హరీష్‌ రావు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తనపై విమర్శలు చేసిన మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావును దృష్టిలో ఉంచుకుని మెదక్‌ స్థానంలో పద్మా దేవేందర్‌రెడ్డి గెలుపును సవాల్‌గా తీసుకున్నారు.
పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కాంగ్రెస్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ తిరుపతిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు తదితర నాయకులను బీఆర్‌ఎస్‌లోకి రప్పించారు. బీఆర్‌ఎస్‌ నాయకులతో మండలాల వారీగా సర్వే చేయిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ తదనుగుణంగా గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. నర్సాపూర్‌ సెగ్మెంట్‌లోసునీతారెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆయన వర్గం నాయకులు అసంతృప్తికి గురవడంతో ఇరు వర్గాలను
కూర్చోబెట్టి సమన్వయం కుదిర్చారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి హరీశ్‌ రావు జిల్లాలోని గజ్వేల్‌, దుబ్బాక ప్రచార బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేటలో ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించడమే కాకుండా వంద ఓట్ల కు ఒక ఇన్‌చార్జిని నియమించి పోలింగ్‌ రోజు వరకు ప్రచారాలు కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. ఇతర నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు సిద్దిపేట పరిస్థితులను సవిూక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌
నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఎన్నికల ప్రచారాలకు సమాయత్తం చేయడంతో పాటు అసంతృప్తులను బుజ్జగిస్తూ ఒక్కటి చేస్తున్నారు. మల్లన్న సాగర్‌, కొండపొచమ్మ సాగర్‌ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి హామి ఇచ్చి వారి మద్దతు పొందే ప్రయత్నాలు ప్రారంభించారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి పై దాడి జరగడంతో ఆయన ఆస్పత్రికే పరిమితమయ్యారు. దీంతో దుబ్బాక బాధ్యతలను కూడా తనపైనే వేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన ముఖ్య నేతల్ని దుబ్బాక మండలాల పర్యవేక్షకులుగా నియమించి ప్రచారాలు ఆగకుండా చూస్తున్నారు. దుబ్బాకలో క్షేత్ర స్థాయి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రభాకర్‌ రెడ్డి గెలుపు కోసం బాటలు వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు మంత్రి హరీశ్‌ రావు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. బలహీనంగా ఉన్న సెగ్మెంట్లతో పాటు బలంగా ఉన్న స్థానాల్లో కూడా అన్నీ తానై నడిపిస్తున్నారు. జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు కాస్త బలహీనంగా ఉండడంతో పార్టీ సెకండ్‌ క్యాడర్‌ నాయకులు వారికి సహకరించడం లేదు. దీంతో వారితో సమావేశమై సమస్యలు పరిష్కరించే పనిలో పడ్డారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు