- మూడు రోజుల్లో ఏకంగా రూ.658 కోట్లు
- మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం రికార్డు
- 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయం
- డిసెంబర్ 31న 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డ్
- రోజే రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగింది : పౌల్ట్రీ వ్యాపారులు
- ఆదివారం ఒక్కరోజే 2,700 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
- మియాపూర్లో అత్యధికంగా 253 మందిపై కేసు
- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 కేసులు
- 26 – 35 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువున్నారని పోలీసుల వెల్లడి
హైదరాబాద్ : పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. అయితే.. 30 రోజు శనివారం కావటంతో ఈసారి న్యూఇయర్ వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి. 29 రాత్రి నుంచే వైన్స్ల వద్ద జాతర మొదలైంది. ఇక.. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో.. మందుబాబులు బరిలో దిగి సత్తా చాటారు. బీర్లతో పాటు హార్డ్ కూడా బారీగానే అమ్ముడుపోయింది. ఈ నెల 29, 30, 31 మూడు రోజుల్లోనే ఏకంగా రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావటం.. అందులోనూ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టు చెప్తున్నారు. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు సమాచారం. ముందుగానే ఈవెంట్లు ప్లాన్ చేసుకోవటంతో.. లిక్కర్ గోదాంల నుంచి ముందుగానే మద్యం తరలించారు. దీంతో.. 30వ తేదీనే రూ.313 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం. డిసెంబర్ 31న భారీ సేల్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మద్యంతో పాటు కూల్ డ్రిరక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. వాటితో పాటు చికెన్, మటన్, చేపలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణంగా హైదరాబాద్లో ప్రతిరోజు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతాయి. కానీ నిన్న డిసెంబర్ 31 కారణంగా 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ ధర రూ.900 వరకు పలుకుతోంది. అయినప్పటికీ దాదాపు 25వేల నుంచి 30వేల క్వింటాళ్ల మటన్ విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. న్యూఇయర్ రోజైన.. ఈ రోజు కూడా విక్రయాల్లో జోరు కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి విక్రయాలు మరింతగా పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్ 31న పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్న సంబరాలు ప్రభుత్వ ఖజానను నింపాయి. తెలంగాణలో ఒక్కరోజే 313కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడైంది. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.కాగా, హైదరాబాద్ నగర పరిధిలోని పబ్బులు, క్లబ్బులతో పాటు వివిధ చోట్ల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో ఆడి పాడారు. 2023కు వీడ్కోలు చెబుతూ మందు పార్టీలు చేసుకున్నారు. ఆపై వాహనాలతో రోడ్లెక్కి హంగామా చేశారు. వేడుకలలో మద్యం సేవించి ఆపై వాహనాలు నడపొద్దంటూ పోలీసులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మ్నెత్తం మూడు కమిషనరేట్ పరిధుల్లో (సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ) మ్నెత్తం 3,258 కేసులు నమోదు చేశారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,500 మంది మందుబాబులు పట్టుబడగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,241 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండడం విశేషం. సిటీలో ఎక్కువగా మియాపూర్లో 253 కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిలో 382 మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు కాగా, 26 సంవత్సరాల నుంచి 35 వయసున్న వారు 536 మంది ఉన్నారని వివరించారు. సీజ్ చేసిన వాహనాలలో 938 టూ వీలర్స్, 21 త్రీ వీలర్స్, 275 ఫోర్ వీలర్స్, 7 హెవీ వెహికల్స్ ఉన్నాయి.