వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్ ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీ సందర్భంగా షమీ చీలమండ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఆడిన ఏడు మ్యాచ్లలో అతను పటిష్ట ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రపంచ కప్ తర్వాత, భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లతో సిరీస్లు ఆడిరది. ఇందులో షమీ ఎంపిక కాలేదు. ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల కోసం అతనికి జట్టులో చోటు దక్కలేదు. 33 ఏళ్ల షమీ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్నెస్పై పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో షమీ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అతను అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. దీంతో ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మనం కష్టపడి చేసే ఏ పని అయినా.. ఎల్లప్పుడూ మనకు ప్రతిఫలాన్ని ఇస్తుందంటూ ఆ వీడియోకి షమీ క్యాప్షన్ కూడా అందించాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జనవరి 25న హైదరాబాద్లో జరిగే మ్యాచ్తో ఇంగ్లండ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల కోసం టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. షమీ గైర్హాజరీలో అవేశ్ ఖాన్కు అవకాశం దక్కింది. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో ఉన్నారు.