Friday, May 17, 2024

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 1:4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేస్తారు. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు రేవంత్‌ రెడ్డి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఏఐసీసీ నేతలను ఆహ్వానించారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లట్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘెల్‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చౌహన్‌, గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్పమొయిలీ, కుంతియా, వాయిలార్‌ రవి, మాణిక్కం ఠాగూర్‌, మరికొందరు ముఖ్యులను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్‌ కుమార్‌ షిండే, కురియన్‌, మరికొందరు నేతలను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను కూడా పిలిచారు. కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, హరగోపాల్‌, కంచ ఐలయ్యలతోపాటు మరికొందరు ఉద్యమ కారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం జగన్‌ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులను పిలిచారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో పాటు వివిధ కుల సంఘాల నేతలు, మేధావులను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు