- దేశీయ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ముకేశ్ అంబానీ.
- ఆయన సంపద 92 బిలియన్ డాలర్లు..
- భారత్ లోని 100 మంది కుబేరుల మొత్తం
సంపద 799 బిలియన్ డాలర్లు..
న్యూ ఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీయ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన లిస్ట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గతేడాది అంబానీని కూడా దాటేసిన అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ఈసారి 68 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిల్చారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దెబ్బతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుదేలవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ను విడగొట్టి, లిస్టింగ్ చేయడంతో పాటు తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించారు. ముకేశ్ అంబానీ వారసత్వ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసినట్లు ఫోర్బ్స్ కొనియాడింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ ఒక హాట్స్పాట్గా ఉంటోందని ఫోర్బ్స్ తెలిపింది. భారత్లోని 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉంది.