- మున్నూరుకాపు సమావేశంలో తుమ్మల, పొంగులేటి
ఖమ్మం : మున్నూరుకాపు సంక్షేమానికి కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్పార్టీ అని ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పదికి పది స్థానాలను గెలిపించండి. మీ సంక్షేమం కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కోఛైర్మన్, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన మున్నూరుకాపు ఆత్మీయ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్రరాజకీయాల్లో మున్నూరుకాపుల పాత్ర ఆది నుండీ కీలకమని,స్థానికంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి మున్నూరుకాపు వర్గానికి చెందిన ఒక ముఖ్యనేతను పలుమార్లు ఇబ్బదులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందారన్నారు. ప్రస్తుత తరుణంలో పెత్తందారీ వ్యవస్థకు ఆజ్యం పోస్తున్న సదరుప్రజా ప్రతినిధికి తగిన బుద్ధి చెప్పే అవకాశాన్ని కాపు సోదరులు వినియోగించుకోవాలని కోరారు.అత్యంతప్రాభల్యం ఉన్న మున్నూరు కాపులు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తరుపున పోటీ చేస్తున్న పది నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక కాపుల రుణం తీర్చుకుంటామన్నారు. ఈసందర్భంగా వారి సమక్షంలో మున్నూరుకాపు నాయకుడు రాపర్తి రంగారావు కాంగ్రెస్పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో పువాళ్ల దుర్గా ప్రసాద్, కృష్ణ, రంగారావు, జావెద్, లక్ష్మీనారాయన, బేబి, స్వర్ణకుమారి, దేవేందర్, శ్రీనివాసరావు, శ్రీను, హనుమంతరావు, నరసింహారావు, సోమనాథం, మంజుల, ప్రసన్న పలువురు కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.