Wednesday, May 15, 2024

నేటి పోలింగ్‌పై నేతల నజర్‌

తప్పక చదవండి
  • బూత్‌స్థాయి కార్యకర్తలతో నేతల సవిూక్ష
  • ఎక్కువ మందిని ఓటుకు తీసుకుని వచ్చేలా ప్లాన్‌
  • గతానికి భిన్నంగా అన్ని పార్టీల నేతల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక పోల్‌ మేనేజ్‌మెంట్‌పై నేతలు దృష్టి సారించారు. గురువారం జరిగే పోలింగ్‌లో ఎక్కువమందిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకుని వచ్చేలా బూత్‌ స్థాయి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేతలు నేరుగా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను సవిూక్షిస్తున్నారు. పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లను నేరుగా కలుసుకుని ఓట్లను అర్థించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌ 9న షెడ్యూల్‌ వెలువడగా.. ఈ నెల 3న నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచారం ఊపందుకుంది. మొత్తం119 నియోజకవర్గాలకుగాను.. ఏజెన్సీ ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలతో, మిగతా 106 సెగ్మెంట్లలో 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో 30వ తేదీన గురువారం నాడు పోలింగ్‌ జరగ నుండడంతో రాష్ట్రమంతటా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహించడానికి వీలు లేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజక వర్గాల నుంచి ఇప్పటికే తిరిగి వెళ్లిపోయారు. ప్రచారంలో ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా సుడిగాలి పర్యటనలు చేశారు. అందరికంటే ముందుగా ఆగస్టు 21న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. అక్టోబర్‌15న హుస్నాబాద్‌ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 31 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 95 సభల్లో పాల్గొన్నారు. గజ్వేల్‌ సభతో ప్రచారం ముగించారు.రేవంత్‌ రెడ్డి 63 నియోజకవర్గాల్లో 87 సభలకు హాజరయ్యారు. అక్టోబర్‌ 16న వికారాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టి, మల్కాజ్‌గిరి రోడ్‌షోతో ముగించారు. కేటీఆర్‌60 రోజుల్లో 70 రోడ్‌ షోలలో పాల్గొన్నారు. 30 పబ్లిక్‌ విూటింగుల్లో ప్రసంగించారు. వివిధ వర్గాలతో సమావేశాలు పెట్టి మాట్లాడారు. 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.హరీశ్‌రావు 60 రోజుల్లో 90కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో, రోడ్‌ షోలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత 70కి పైగా ప్రచార సభలు, రోడ్‌షోల్లో ప్రచారం చేశారు. ఇకపోతే కాంగరెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 15 నియోజకవర్గాల్లో 25 సభలు.. ప్రియాంక అన్నే సెగ్మెంట్లలో 26 సభల్లో పాల్గొన్నారు. ఖర్గే నాలుగు నియోజకవర్గాల్లో 10 సభల్లో పాల్గొన్నారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య 4 సభలు, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ 4 సభలకు హాజరయ్యారు. ఇక కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ 9 సభల్లో పాల్గొన్నారు. కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా ప్రచారం చేసిన రాహుల్‌, ప్రియాంక గాంధీలు..చివరి రోజున ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తరఫున రేవంత్‌?తో కలిసి వారిద్దరూ భారీ రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌, ప్రియాంక, రాహుల్‌ సెల్ఫీలు తీసుకున్నారు. ప్రధాని మోదీ 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీసీ ఆత్మగౌరవ సభ, ఎస్సీ వర్గీకరణ సభల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చారు. ఆ తర్వాత మూడు రోజులు ఇక్కడే మకాం వేసి రోజుకు రెండు సభల్లో పాల్గొన్నారు. చివరగా హైదరాబాద్‌ లో రోడ్డు షోతో ప్రచారం ముగించారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా 14 సభల్లో, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా16 సభలు, రోడ్‌ షోల్లో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి 8 సభల్లో, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 13 సభల్లో మహారాష్ట్ర సీఎం షిండే 3 సభల్లో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ 6 సభల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, ఇతర జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, డీకే అరుణ, బండి సంజయ్‌, ఈటల, రాజాసింగ్‌, రఘునందన్‌ రావు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టి పోటీని ఇస్తోంది. అందుకు తగ్గట్లుగా ప్రచారం చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు