దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును నేడో రేపో ప్రకటించే అవకాశముంది. మూడు ఫార్మాట్ల సిరీస్లు ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్తున్న టీమిండియాను నడిపించే నాయకుడిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా టీ20లకు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తుండగా వరల్డ్ కప్లో అతడికి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ సారథిగా ఉన్నాడు. కానీ సఫారీ టూర్లో మాత్రం మరోసారి భారత సారథి మార్పు తప్పదని తెలుస్తున్నది. పరిమిత ఓవర్లలో కెఎల్ రాహుల్ ను సారథిగా నియమించే అవకాశాలున్నట్టు సమాచారం. దక్షిణాఫ్రికా టూర్లో టీ20 జట్టును నడిపించడానికి బీసీసీఐ.. రోహిత్ శర్మను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ రోహిత్ ఒప్పుకోని పక్షంలో కెఎల్ రాహుల్కు ఆ అవకాశాలుంటాయని సమాచారం. వన్డేలు ఆడేందుకు రోహిత్ రెడీగా ఉన్నా టీ20లు ఆడేది అనుమానమే. దీంతో టీ20లలో రాహుల్ను సారథిగా నియమించేందుకు బీసీసీఐ ముహుర్తం ఖరారుచేసినట్టు సమాచారం. తాజాగా కెఎల్ రాహుల్ తన ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో షేర్ చేసిన ప్రోమో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ప్రోమోలో కెఎల్ రాహుల్.. “సౌతాఫ్రికాతో సవాలు కఠినమని తెలుసు, కానీ సవాళ్లు ఉన్నప్పుడే అసలైన మజా ఉంటుంది. మేం సౌతాఫ్రికా సవాలును స్వీకరిస్తున్నాం. కచ్చితంగా గెలుస్తాం..” అని చెబుతున్న ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.