- కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు సూచన
- త్వరలో శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్న కేసీఆర్
- ఎన్నికల ఫలితాలపై తొలిసారి కేసీఆర్ స్పందన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగేందుకు అవకాశం ఉందని తెలిపారు. అయితే… ప్రజలు ఇచ్చిన తీర్పుతో హుందాగా పక్కకు తప్పుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని.. కాంగ్రెస్ సర్కారులో ఏం జరగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సూచించారు. అంతేకాకుండా.. త్వరలోనే తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహించుకుందామని కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇక అదే సమావేశంలో.. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతను కూడా ఎన్నుకుందామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కేసీఆర్ను ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు కూడా కలిశారు.