Monday, April 29, 2024

నిరాశలో హస్తం

తప్పక చదవండి
  • సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌..
  • ఎటూతేల్చులేక పోతున్న ఢిల్లీ అధిష్టానం
  • ఢిల్లీకి మారిన తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌
  • అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి డికె శివకుమార్‌
  • నేడు కర్గేతో చర్చించనున్న శివకుమార్‌
  • నూతన ప్రభుత్వం రాకతో ప్రగతి భవన్‌ ముస్తాబు
  • ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం
  • భట్టికి డిప్యూటీ సీఎం, ఉత్తంకు స్పీకర్‌ హోదాలు దక్కే అవకాశం..?
  • కొత్త సీఎంకు తెలుపు రంగులో కొత్త కాన్వాయ్‌ల ఏర్పాటు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీ చేరుకుంది. సోమవారం సాయంత్రమే సిఎం ప్రమాణం ఉంటుందని ముందుగా ప్రకటించినా.. అబ్యర్థి ఎంపికను కాంగ్రెస్‌ మంగళవారం నాటికి వాయిదా వేసింది. ఈ మేరకు పరిశీలకులు డికె శివకుమార్‌ తదితరులను ఢల్లీి రావాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశించింది. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సీఎం పీఠం కోసం యడ్యూరప్ప, డీకే శివకుమార్‌ మధ్య గ్రూప్‌ రాజకీయాలు నడిచాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అక్కడ సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. ఇప్పుడు ఇదే సీన్‌ తెలంగాణలోనూ రిపీట్‌ అవుతోంది. అందరూ రేవంత్‌రెడ్డి సీఎం అని ఫిక్స్‌ అయిన వేళ.. కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్‌, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్‌ వార్‌ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం తేల్చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ఏఐసీసీ పెద్దలు పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. రాత్రికి ఢిల్లీకి ఏఐసీసీ పరిశీలకులు వెళ్లనున్నారు. బేగంపేట అయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి శివకుమార్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారమే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీసీ పరిశీలకుల నేతృత్వంలో ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సాయంత్రం వరకు ముఖ్యమంత్రి పేరును అధిష్ఠానం ప్రకటిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణానికి సైతం ఏర్పాట్లు జరిగాయి. అయితే, సీఎల్పీలో సీఎం ఎవరనేదానిపై కొలిక్కి రాలేదు. గంటల పాటు సీనియర్‌ నేతలతో డీకే శివకుమార్‌తో పాటు ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. అయినా సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. సమావేశం జరిగిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ నుంచి సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ వెళ్లిపోయారు. నలుగురు నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత డీకే శివకుమార్‌తో పాటు నలుగురు ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది. దీంతో ఐదుగురు నేతలు ఢిల్లీకి పయణమయ్యారు. చర్చలకు సంబంధించిన సారాంశంపై పరిశీలకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పరిశీలకులు, డీకే శివకుమార్‌ కలిసి కాంగ్రెస్‌ ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గేతో మంగళవారం ఉదయం సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ కూర్పుపై సమాలోచనలు చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అయితే.. సాయంత్రమే సీఎం అభ్యర్థి ప్రకటన ఉంటుందని సర్వత్రా ఉత్కంఠ రేపగా.. ఉన్నట్టుండి నేటికీ వాయిదా వేయటం వెనుక కారణాలేంటన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సీఎల్పీ నాయకుడి విషయంలో.. ఎమ్మెల్యేల్లో ఏకాభిప్రాయం లేకపోవటమా.. లేదా అధిష్ఠానానికే నాయకులు పంపిన పేరు నచ్చకపోవటమా.. అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొత్తంగానికి తెలంగాణకు కొత్త సీఎం ఎవరన్నది.. మరి రేపైనా ప్రకటిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు