- అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా
- 7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన
- 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేధన
- 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్
- ప్రపంచకప్లో దాయాదిపై తిరుగులేని ఆధిపత్యం
న్యూఢిల్లీ : వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఓడిపోని రికార్డును భారత్ మరోసారి కాపాడుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దాయాదుల సమరంలో 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. మ్యాచ్కు ముందు ఆడిన 7 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాక్పై గెలిచిన భారత్.. నేడు సైతం అదే ఫలితం పునరావృతం చేసింది. లీడ్ను 8-0కు పెంచుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిరచింది. తొలుత బౌలింగ్లో కట్టడి చేసిన టీమిండియా.. బ్యాటింగ్లోనూ టీ20 తరహా ఆటతో చెలరేగిపోయింది. దీంతో వన్డే ప్రపంచకప్ 2023లో విజయాల హ్యాట్రిక్ను నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (86) మరోసారి చెలరేగిపోవడంతో పాకిస్థాన్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచిన పాక్.. ఒత్తిడికి చిత్తై వికెట్లు సమర్పించుకుంది. కేవలం 36 పరుగులు మాత్రమే జోడిరచి చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ ఆజమ్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీంతో 42.5 ఓవర్లలో పాకిస్థాన్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు తలా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం స్వల్వ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు.. పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఓపెనర్ శుభ్మన్ గిల్.. వచ్చీ రాగానే 4 ఫోర్లు కొట్టి.. ఫామ్లోకి వచ్చాడు. కానీ, ఆ ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ (16) సైతం త్వరగానే ఔట్ అయ్యాడు. అయితే, అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్లోనూ జోరు కొనసాగించాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ.. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 6 సిక్సులు, 6 ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ.. అదే ఊపులో భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో సెంచరీకి మరో 14 పరుగుల ముందే నిరాశగా పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (53), కేఎల్ రాహుల్ (19) లాంఛనం పూర్తి చేశారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్.. వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచినట్లయింది. దీంతో ఈ మెగా టోర్నీలో ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్.. వరుసగా 3 మ్యాచుల్లో గెలుపొందింది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో అక్టోబర్ 19న బంగ్లాదేశ్తో తలపడనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.