- 200 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమ నిర్మాణం
- దర్జాగా కబ్జా చేసిన చింత వెంకటేశ్వర్ రెడ్డి అండ్ టీం
- అనుమతులు సర్వే నెంబర్ 399లో.. నిర్మాణం సర్వే నెంబర్ 398లో..
- క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా హెచ్ఎండీఏ అనుమతులా..!
- ముడుపులకు దాసోహం అవుతున్న కొందరు అధికారులు
- చోద్యం చూస్తున్న హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు..
- అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మనీ మేక్స్ మెనీ థింగ్స్.. అనేది అక్షరాలా నిజం.. డబ్బు ఏదైనా చేస్తుంది.. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం హెచ్ఎండిఏ లో ఇదే జరుగుతోంది.. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలకు, ప్రభుత్వ భూములకు అనుమతులు జారీ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు కొందరు అధికారులు. హెచ్ఎండిఏలో అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ విధులను మరచిపోతుండటంతో ఆగడాలు ఆగడం లేదు.. దమ్మాయిగూడ మున్సిపల్ లో యథేచ్ఛగా జరుగుతున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.. వివరాలు చూద్దాం..
దమ్మాయిగూడ సర్వే నంబర్ 399 లో నిర్మాణానికి హెచ్ఎండిఎ అనుమతులు తీసుకొని సర్వే నంబర్ 398లోని మాస్టర్ ప్లాన్ రోడ్డులో భాజాప్త కబ్జా చేసి అక్రమార్కులు అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. పక్కనే సర్వే నంబర్ 396, 397లలో చేపడుతున్న హెచ్ఎండిఎ లేవుట్ పక్కనుండి మాస్టర్ ప్లాన్ రోడ్డు వెలుతుండడంతో రోడ్డు కోసం సుమారు 100 ఫీట్ల మేర వదిలి లేఅవుట్ పనులను చేపడుతున్నారు. కానీ మాస్టర్ ప్లాన్ కోసం వదిలిన మిగతా 100 ఫీట్ల స్థలంలో చింత వెంకటేశ్వర్ రెడ్డి అండ్ టీం సర్వే నెంబర్ 399లో నిర్మాణ అనుమతులు తీసుకొని, సర్వే నెంబర్ 398లో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు వదిలిన స్థలంలో అక్రమంగా అపార్ట్ మెంట్ నిర్మాణం చేస్తున్నారు. వాస్తవంగా అనుమతులు ఇవ్వాలంటే పర్యవేక్షణ అధికారులు అనుమతులిచ్చే ముందు స్థల పరిశీలన, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేసిన తరువాత అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడా పర్యవేక్షణ అధికారులు ముడుపులకు ఆశపడి, అక్రమనిర్మాణ దారునితో చేతులు కలిపి తప్పడు అనుమతులు ఇవ్వడం విస్మనాయానికి గురిచేస్తుంది. మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలిసినా, ఇవేవి పట్టించేకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమాలకు తావీస్తుంది.
టీపీఓ శ్రీధర్ వివరణ –
ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ను ఆదాబ్ ప్రతినిధి సంప్రదించి, వివరణ కోరగా హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చినప్పుడు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉండదు. హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన అనుమతులను రద్దుచేయవల్సిందిగా హెచ్ఎండీఏ అధికారులకు లేఖ రాయడం జరిగిందని పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. యధేచ్ఛగా మాస్టర్ ప్లాన్ రోడ్డు స్థలంలో భారీ నిర్మాణం సుమారు 70శాతం పనులు పూర్తి కావొస్తున్న మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.
ఈ అక్రమ వ్యవహరాలపై జిల్లా కలెక్టర్ పూర్తిగా దర్యాప్తు చేసి, వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తప్పుడు అనుమతులు ఇచ్చిన హెచ్ఎండీఎ ప్లానింగ్ అధికారి భీంరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ లపై శాఖపరమైన చర్యలు తీసుకొని, మాస్టర్ ప్లాన్ రోడ్డు స్థలాన్ని రక్షించాలని దమ్మాయిగూడ మున్సిపల్ వాసులు కోరుతున్నారు.