- కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్) : జిల్లాలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ లలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 4 నియోజకవర్గాలలో జరుగు అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ పై తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు, ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.పంపిణీ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది అధికారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిక్షణం అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజరాబాద్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మహేశ్వర్, ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, రాజుఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు.