కంటోన్మెంట్ : దళితులు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద బన్సీలాల్ పేట కు చెందిన 6 గురు లబ్దిదారులకు దళిత బంధు క్రింద సిల్ట్ కార్తింగ్ వాహనాలను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేస్తుందని చెప్పారు. ఆర్ధిక సహాయం అందజేయడమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకొనే అవకాశాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని అన్నారు.ఒక్కో వాహనాన్ని 9.40 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ఈ వాహనాలను మెట్రో వాటర్ వర్క్స్ శాఖ కు అద్దెకు ఇవ్వడం వలన ప్రతినెల లబ్దిదారులకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 162 మందికి ఈ వాహనాలను అందజేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అద్యక్షులు ఎల్ వెంకటేష్ రాజు,నాయకులు గజ్జెల శ్రీనివాస్,శివ కుమార్,సురేష్, వినోద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.