- ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత..
- గోషామహల్ టికెట్ ఆయనకే కన్ఫర్మ్.. !
- పార్టీ విడుదల చేసిన లిస్ట్ లో రాజాసింగ్ పేరు..
- నిజమైన రాజాసింగ్ జోష్యం..
- సంతోషం వ్యక్తం చేసిన హిందూ అభిమానులు..
హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా ప్రకటించింది. రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ గత ఏడాది సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ఈమేరకు బీజేపీ విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో రాజా సింగ్ పేరును పార్టీ అధిష్టానం చేర్చింది.
తెలంగాణలో బీజేపీకి బూస్ట్లాంటి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు తలనొప్పులు తెచ్చిపెట్టటంతో.. ఏడాదికాలంగా ఆయన్ని దూరంపెట్టింది కమలంపార్టీ. ఎన్నికలవేళ ఆయనకోసం మళ్లీ తలుపులు తెరిచింది. సిట్టింగ్ సీటునుంచి మళ్లీ ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల బరిలో మరోసారి తలపడేందుకు రెడీ అయ్యారు.
తెలంగాణలో ఫస్ట్ లిస్ట్తో పాటు బీజేపీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత కూడా ఒకటి. తెలంగాణలో ఏడాదికాలంగా పక్కనపెట్టిన రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు. దీంతో ఫస్ట్ లిస్ట్లోనే గోషామహల్ అభ్యర్థిగా రాజాసింగ్ పేరుని కూడా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. పార్టీ పక్కనపెట్టినా ఇన్నాళ్లుగా తన పని తానుచేసుకుపోతున్నారు రాజాసింగ్.. అధినాయకత్వం సస్పెన్షన్పై పునరాలోచిస్తుందని, తనకే టికెట్ ప్రకటిస్తుందని రెండ్రోజులక్రితమే చెప్పారు. చివరికి అదే జరిగింది.