- తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎర్రోళ్ళ శివయ్య
- ఇందిరా గాంధీ ప్రభుత్వం పంచిన భూములను తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ గుంజుకున్నారు : బింగి రాములు
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో సుమారు దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు వున్నాయని సుమారు 16 లక్షల కుటుంబాలు వీటిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయని, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది మొదలు భూమి లేని నిరుపేదలు ఈ తరహా భూములను కష్టపడి వ్యవసాయం చేసి సాగులోకి తెచ్చాయి. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ వున్న హయాంలో బడుగు బలహీన వర్గాలతో పాటు భూమిలేని అన్ని నిరుపేద వర్గాలకు ఇటువంటి అసైన్డ్ భూములను పంపిణీ చేసి దారిద్య్ర రేఖకు దిగువన వున్న వర్గాల ప్రజలకు అప్పటి ప్రభుత్వాలే అండగా నిలబడి సహకరించగా నేటి ప్రభుత్వాలు వాటిని పేదవాడి నోటి వద్ద నుండీ గుంజుకోవాలని చూడటం అమానుషం అని తెలంగాణా అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ళ శివయ్య ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో నిరుపేదలు ఆధారపడి బ్రతుకుతున్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నారని వాటిని తిరిగి యధాతధంగా వాటి యజమానులకు చెందేవిధంగా చట్టంలో మార్పులను తీసుకురావాలని రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు. ప్రధానంగా 1977 నాటి పిఓటి చట్టాన్ని రద్దుచేసి అసైన్డ్ భూములను వాటి పూర్వపు యజమానులకు కుల మతాలకు అతీతంగా అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ సిఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ వ్రాసినట్లు ఎర్రోళ్ల శివయ్య మీడియాకు వివరించారు. తెలంగాణా అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, కార్యదర్శి బింగి రాములు, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అధ్యక్షులు మురళీధర్ దేశ్పాండే, అడ్వైజర్ సుదర్శన్ బాబు, శ్యాం కుమార్, సల్మాన్ రాజు కోహిర్ లాజర్ యాదగిరి అశోక్ తదితరులు పాల్గన్నారు.