- సీఎం ను కలిసిన పలువురు క్రీడాకారులు
- రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న రోజా
అమరావతి : అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు సీఎం జగన్ను శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ. 4.29 కోట్లను క్రీడాకారులకు ప్రభుత్వం అందించింది. ఏషియన్ గేమ్స్లో మెడల్ సాధించిన విన్నర్లు సీఎం జగన్ను కలిశారని మంత్రి రోజా తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. మెదటిసారి భారత దేశానికి ఈ క్రీడాపోటీల్లో 107 మెడల్స్ వచ్చాయని.. ఏపీ నుంచి 13 మంది రిప్రజెంట్ చేస్తే 8మందికి మెడల్స్ వచ్చాయన్నారు. మెడల్స్ సాధించిన ప్లేయర్లకు నాలుగుకోట్ల 29 లక్షల రూపాయలు రిలీజ్ చేశామన్నారు. జగన్ చెస్ చాలా బాగా ఆడుతారని… అందుకే కోనేరు హంపిని చూశాకా చెస్ గేమ్ను కూడా విస్తృతంగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా పిల్లల్లోని ట్యాలెంట్ను బయటకు తీసుకువస్తామన్నారు. జగనన్న సీఎం అయ్యాక స్పోర్ట్స్కు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వరుస మెడల్స్ వివిధ క్రీడల్లో లభిస్తున్నాయని మంత్రి రోజా పేర్కొన్నారు.