- ఏర్పాట్లు చేస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్
- సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
- సూర్యుడిపై అధ్యయనం చేయనున్న ఆదిత్య
చంద్రయాన్-3 సక్సెస్ అయిన తర్వాత.. సూర్యూనిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ‘ఆదిత్య ఎల్1’ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్య ఎల్1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.