- థర్మకోల్ పరిశ్రమలో చెలరేగిన మంటలు
- ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న అధికారులు
- సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం..?
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ థర్మకోల్ తయారీ పరిశ్రమలో మంటలు దట్టంగా వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమయి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, శంషాబాద్, గగన్పహాడ్ పారిశ్రామిక వాడలో ఉన్న థర్మకోల్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. థర్మకోల్ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. విద్యుత్ తీగల నుంచి థర్మకోల్ షీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అనంతరం మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.