Sunday, May 19, 2024

విధి నిర్వహణలో పక్షపాతం..

తప్పక చదవండి
  • హైదరాబాద్‌లో అధికారులను సస్పెండ్‌ చేసిన ఈసీ
  • చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారికి లేఖ
  • సస్పెన్షన్‌కు గురైన వారిలో డీసీపీ, ఏసీపీ, సీఐ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : హైదరాబాద్‌లో ముగ్గురు పోలీసులను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో పక్షపాతం చూపించారని వారిపై వేటు వేసింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ పరిధిలో నగదు పట్టుబడిన వ్యవహారంలో పక్షపాతం చూపించారన్న ఆరోపణలతో.. డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను విధుల నుంచి ఈసీ తప్పించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ముషీరాబాద్‌లోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో సుమారు రూ.18 లక్షల నగదు, చెక్‌బుక్‌, 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ కుమారుడు ముఠా జై సింహకు చెందినదిగా పోలీసులు గుర్తించగా.. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం నిందితుల వివరాలు గుర్తుతెలియనివారిగా పేర్కొనటం గమనార్హం. ఈ కేసులో ముఠా జై సింహను కాకుండా ముఠా గోపాల్‌ స్నేహితులు సంతోష్‌, సుధాకర్‌ను అరెస్టు చేశారు. అయితే.. అసలైన నిందితులను అరెస్టు చేయకుండా.. సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఈసీ గుర్తించింది. దీంతో.. ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లను సస్పెండ్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐ జహంగీర్‌ స్థానంలో ముషీరాబాద్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న డీఐ వెంకట్‌ రెడ్డిని నియమించినట్లు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య ప్రకటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు