- హైకోర్టు సీజేకు తెలంగాణ సర్కార్ లేఖ
- మేడిగడ్డపై జుడీషియల్ ఎంక్వైరీ కోసం..
- వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు
- బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ షురూ
- ఇంజనీర్ కార్యాలయంలో సోదాలు
- 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు
- సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
- పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో టెన్షన్
హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుప్ప కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్లిన విజిలెన్స్ అధికారులు దాదాపు 8 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. ఈఎన్సీ కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 10 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో అధికారుల తనిఖీలు ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు చేపట్టారు. మహదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ..
మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనను సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ వైఫల్యం వెనుక కేసీఆర్ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయమే తెల్సిందే. ఆ తర్వాత ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. ఇటీవల మేడిగడ్డలో మం త్రుల బృందం పర్యటించింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మా ణానికి రూ.4600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రుల పరిశీలన అనంతరం ఒక స్తంభం 1.2 మీటర్ల మేర కుంగిపోయినట్లు తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోవడం పై విచారణలో దోషులుగా తేలిన వారిపై శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లో నీటిపారుదల శాఖలో గోప్య త, రహస్య జీవితం , అవినీతి ఆరోపణలు ఎన్నో వచ్చా యి.వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకుంటామని మంత్రి అన్నారు. నీటిపారుదల శాఖలో అన్నీ వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని అందుచేత కాళేశ్వ రం పై విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేయాలనీ ప్రభుత్వం భావిస్తుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.