Tuesday, April 30, 2024

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

తప్పక చదవండి
  • బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్..
  • రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు
  • సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా..
  • ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్..

హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలందరికీ తెలియజేసినా అక్రమాలు చేసిన సదరు వ్యక్తులకు ఆగ్రహం రావడం సహజమే. కానీ పేదవాడి భూమిని కబ్జా చేస్తే అక్కడ అన్యాయం జరిగినట్లు, తప్పు చేసినట్టు అధికారులకు తెలిసినా కానీ, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం వారికి వెన్నతో పెట్టిన విద్య..వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలం, మక్తా వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఆన్ లైన్ ఎంట్రీ చేసుకుని.. పేదవాడి కడుపుకొడుతున్న బాగోతం బయటపడింది.. పైగా ఇది ఎలా జరిగింది.. తమకు న్యాయం చేయమని బాధితుడు తహశీల్దార్ ని కోరితే.. కోర్టుకు వెళ్లి తేల్చుకోమని చెప్పడం దారుణం.. తాము చేసిన తప్పుకి ఒక నిరుపేద గిరిజన కుటుంబాన్ని హింసిస్తున్న అధికారులు.. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండలం, మక్తా వెంకటాపూర్ గ్రామము, కొత్తపల్లి తండా నివాసి అయిన సభావత్ బీల్యా తండ్రి కండ్యకు.. మక్తా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే 40లో సుమారు 32 గుంటల భూమి 1989లో.. నజరున్నీసా బేగం భర్త మోహ్హమద్ ఆలీ నుండి బీల్యా పూర్వికులు కొని వారి పూర్వికులతో పాటు సాగు చేసుకుంటున్నారు. కానీ 2019 సంవత్సరంలో బీల్యా పేరు మీద ఉన్న భూమి ఎవరికీ అమ్మకుండానే, బీల్యాకు తెలియకుండానే ఆ భూమి కుల్కచర్ల మండలం, మక్తా వెంకటాపూర్ గ్రామానికి చెందిన విస్లావత్ దొడ్యా తండ్రి టీక్యా పేరుమీద ఎలాంటి సంబంధం లేకపోయినా ఆన్ లైన్ రికార్డులో చూపిస్తోంది.. ఇదే విషయమై చౌడాపూర్ తహసీల్దార్ దగ్గరికి వెళ్లి అడిగితే.. మాకు ఎలాంటి సంబంధం లేదని.. ఇది కుల్కచర్ల మండలం కింద వస్తుందని.. తహసీల్దార్ గా హసీనాబేగం, వీఆర్వో భీమయ్యే, ఆర్.ఐ. లింగం లు వీధులు నిర్వహిస్తున్న సమయంలో ఆన్ లైన్ రికార్డుల్లో విస్లావత్ దొడ్యా పేరు ఎక్కిందని.. ఈ భూమి మీకు కావాలంటే కోర్టులో పోరాటం చేయమని ఉచిత సలహా ఇవ్వడం జరిగిందని బాధితులు వాపోతున్నారు.. ఒక అధికారి అయ్యుండి తాము చేసిన పొరబాటుకి తమను కోర్టుకు వెళ్లాలని చెప్పడం ఎంతవరకు న్యాయం అని వారు ప్రశ్నిస్తున్నారు..

ఇదే విషయమై బాధితుడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి , జిల్లా ఎస్పీకి, ఆర్.డీ.ఓ.కి , ఎమ్మార్వోకి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.. ఒక పేదవాడు కోర్టుకు వెళ్లి డబ్బు ఖర్చుపెట్టి, న్యాయం కోసం పోరాడగలడా అని ప్రశ్నిస్తున్నారు.. అధికారులు ఈ విషయంపై ఆలోచించాలని, వారు తగురీతిగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నాడు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు