గాజా సిటీ : హమాస్ ఉగ్రవాదులను వెంటాడుతున్న ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రధాన అల్ షిఫా ఆస్పత్రి లోకి ఎంటరయ్యారు. మరుభూమిగా మారిన ఆ హాస్పిటల్ను హమాస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి చేసే లక్ష్యంతో ఐడీఎఫ్ ముందుకు వెళ్తోంది. స్థానిక ప్రజల్ని ఆస్పత్రిలో బందీలుగా చేసిన హమాస్పై ఐడీఎఫ్ అటాక్ చేస్తోంది. హాస్పిటల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులందరూ లొంగిపోవాలని ఐడీఎఫ్ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. అల్ షిఫా ఆస్పత్రిలోని ఓ ప్రదేశంలో హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ దళాలు పోరాడుతున్నట్లు మిలిటరీ ఓ ప్రకటనలో చెప్పింది. ఇక్కడ నుంచే ఓ కమాండ్ సెంటర్ను ఆ ఉగ్రవాదులు నడుపుతున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. రోగులకు హాని జరగకుండా, మెడికల్ స్టాఫ్, పౌరులకు ఏమీ కాకుండా ఉగ్రవాదులను తరిమివేయనున్నట్లు ఇజ్రాయిల్ దళాలు వెల్లడించాయి.