న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే) వర్గాలకు ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై డిసెంబరు 31లోగా చెందిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రాహుల్ నర్వేకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపుల నిరోధం కోసం తీ సుకువచ్చిన రాజ్యాంగంలోని 10వ అధికరణం పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని ఈ సందర్భం గా నొక్కి చెప్పింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని జాప్యం చేయడానికి.. విధానపర వివాదాల్లో చిక్కుకుపోవడాన్ని అనుమతించబోమని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అదేవిధంగా అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్ను వచ్చే ఏడాది జనవరి 31లోగా తేల్చాలని ధర్మాసనం ఆదేశించింది.