2012లో ప్రపంచం అంతమైపోతుందన్నారు. దీనిపై ఏకంగా ఓ సినిమానే వచ్చింది. అయితే, అలా ఏమీ జరుగలేదు. అయినప్పటికీ, యుగాంతం మీద చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నది. ప్రళయం వచ్చినా తాను, తన కుటుంబ సభ్యుల ప్రాణాలను భద్రంగా కాపాడుకోవాలన్న ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటివారి కోసం అమెరికాలోని ఓ సంస్థ అత్యంత శక్తిమంతమైన ఇండ్లను నిర్మిస్తున్నది. అవే ‘డూమ్స్ డే ఇండ్లు’
ఏమిటీ ఇండ్లు?
అమెరికాకు చెందిన వివోస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అత్యంత శక్తిమంతమైన బంకర్లలాంటి ఇండ్లను నిర్మిస్తున్నది. వీటినే ‘డూమ్స్ డే ఇండ్లు’గా పిలుస్తున్నారు. భూమి లోపల వీటి నిర్మాణాన్ని చేపడుతున్నది. భూకంపాలు, ప్రచండ గాలులు, సునామీలను తట్టుకొనే విధంగా ప్రత్యేకమైన కాంక్రీటు, ఇనుము, స్టీల్తో పది అడుగుల వెడల్పాటి గోడలతో ఈ ఇండ్లను సిద్ధం చేస్తున్నారు.
ధర ఎంత?
ప్రాథమికంగా 575 ఇండ్లను నిర్మించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో 10 వేల మంది ఏడాదిపాటు నివాసం ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అద్దె రూ. 46 లక్షలుగా ఖరారు చేసినట్టు వివరించారు. ఇప్పటికే పలువురు మిలియనీర్లు ఇండ్లను బుకింగ్ చేసుకొన్నట్టు చెప్పారు.
‘డూమ్స్ డే క్లాక్’తో కొత్త భయాలు
భూగోళంపై మానవాళి అంతం లేదా ప్రళయాన్ని సూచించే ‘డూమ్స్ డే క్లాక్’లో సమయాన్ని మిడ్నైట్కు కేవలం 90 సెకండ్ల ముందుకు ఇటీవల సెట్ చేశారు. 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత 17 నిమిషాలుగా ఉన్న క్లాక్ టైమింగ్, 90 సెకండ్లకు తగ్గించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. కరోనా, వాతావరణంలో మార్పులు, కొత్త వ్యాధులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-గాజా ఉదంతం, అణ్వాయుధాల బెదిరింపులు వెరసి ఈ సంక్షోభాలు ఇలాగే కొనసాగితే.. ప్రపంచం అంతమవడానికి ఎంతో కాలంపట్టదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే, డూమ్స్ డే ఇండ్లకు గిరాకీ పెరుగుతున్నట్టు సంబంధిత కంపెనీ తెలిపింది.