- అఫ్గాన్-పాక్ మ్యాచ్ పై కామెంట్స్..
న్యూ ఢిల్లీ : భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు క్రికెట్ ఎక్స్పర్ట్ గా మారింది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా సోమవారం పాకిస్తాన్ –అఫ్గానిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్లో అఫ్గాన్ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్పై ట్వీట్ చేయడం విశేషం. అఫ్గాన్ జట్టును ఇక నుంచి ఎంత పెద్ద జట్టు అయినా తేలికగా తీసుకోకూడదని.. వాళ్లకు నాణ్యమైన ముగ్గురు స్పిన్నర్లతో పాటు మెరుగైన బ్యాటర్లూ ఉన్నారని తెలిపింది. పాక్-అఫ్గాన్ మ్యాచ్ తర్వాత ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్పై అఫ్గాన్ విజయం తర్వాత ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ లో స్పందిస్తూ.. ‘వావ్ అఫ్గానిస్తాన్. ఆ జట్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్పై విజయం గొప్పది కావొచ్చు. కానీ నేటి మ్యాచ్లో ఛేదన మాత్రం అంతకుమించి ఉంది. ఇకనుంచి వాళ్లను సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే నేటి ఆటలో ఆ జట్టు బ్యాటర్లు చూపిన పరిణితి ఆకట్టుకుంది. ఇంగ్లాండ్పై విజయం కంటే నేనైతే నేటి విజయానికే ఓటేస్తా..’అని రాసుకొచ్చాడు.
సింధు ఇదే ట్వీట్ను షేర్ చేస్తూ.. ‘ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లడానికి ముందు కొంతసేపు ఈ మ్యాచ్ చూశాను. అఫ్గాన్తో ఆడేప్పుడు ప్రతి జట్టూ ఆందోళన చెందాల్సిందే. ప్రపంచంలో ఎలాంటి బ్యాటింగ్ లైనప్ను అయినా బోల్తా కొట్టించే స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. వాళ్ల బ్యాటింగ్ మెచ్యూరిటీ కూడా అద్భుతంగా ఉంది..’ అని రాసుకొచ్చింది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో సింధు మళ్లీ టాప్-10లోకి వచ్చింది. ఏడు నెలల తర్వాత ఆమె టాప్ -10లోకి దూసుకొచ్చింది. ఇటీవలే ముగిసిన అర్క్టిక్ ఓపెన్ తో పాటు డెన్మార్క్ ఓపెన్లో కూడా సెమీస్కు చేరినందుకు గాను ఆమె ర్యాంకు మెరుగుపడింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఆమె రెండు స్థానాలను మెరుగుపరుచుకుని పదో స్థానానికి చేరింది.