ఉద్యమ సమయంలో హనుమకొండ కదనరంగం
– పార్టీకి బలాన్నిచ్చేది వరంగల్
– సంక్రాంతికి వచ్చే గగ్గిరెద్దులను నమ్మొద్దు
– ఓరుగల్లుకు ఎప్పుడూ రుణపడి ఉంటా
– బహిరంగ సభలో మంత్రి కేటీఆర్
వరంగల్ : తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్, హనుమకొండనే కదన రంగమైంది.. ఉద్యమానికి కేంద్ర బిందువైంది. అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి ఎప్పుడు బలం కావాలన్న మనం అతిపెద్ద
ప్రజాగర్జన, బహిరంగ సభ ఇదే వరంగల్ గడ్డ, హనుమకొండ నియోజకవర్గంలో పెట్టుకున్నాం. 23 ఏండ్లలో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది ఈ ఓరుగల్లు గడ్డనే. మీకందరికి రుణపడి ఉంటాం. ఓరుగల్లు బిడ్డలకు శిరసు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్లో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దుళ్లోళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు వస్తాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. కేసీఆర్ పథకాలను కాపీకొట్టి, నాలుగు ఓట్లు డబ్బాలో వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చరిత్రలో వాస్తవాలు దాచిన దాగవు అని మంత్రి తెలిపారు. 1956లో హైదరాబాద్ సంస్థానం ఒక రాష్ట్రంగా ఉంటే.. బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సే. 1968లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఖమ్మం, వరంగల్లో అందరూ కలిసి కదం తొక్కితే, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే ఆ రోజు కర్కశకంగా 370 మంది పిల్లల్ని పిట్టల్లా కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ప్రజలు 1971లో మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా సమితికి ఆనాటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు గానూ 11 స్థానాలను గెలిపించారు. మొత్తం భారతదేశానికి వినపడేటట్టు తీర్పు ఇచ్చారు. మా తెలంగాణ మాకు ఇవ్వాలని ఇందిరా గాంధీని డిమాండ్ చేశారు. మళ్లీ మోసం చేసి 11 మంది ఎంపీలను కాంగ్రెస్లో కలుపుకున్నారు. తెలంగాణ వాదాన్ని తొక్కేశారు. మళ్లీ 30 ఏండ్ల తర్వాత గులాబీ జెండా 2001లో ఎగిరితే.. మళ్లీ అదిరిపోయి తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. తెలంగాణ ఇస్తామని 2004లో మాటిచ్చింది. తెలంగాణ తప్పకుండా ఇస్తామని నమ్మబలికి పొత్తు పెట్టుకుంది. అలా 2004 నుంచి 2014 వరకు పదేండ్లు సావగొట్టింది. వేల మంది చావులను కండ్ల చూసింది. మీ అందరి పోరాటంతో ప్రజాశక్తి ముందు తలవంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీ కలిసొచ్చాయి. విధి లేని పరిస్థితుల్లోనే తెలంగాణ జపం చేశారని కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.