Tuesday, April 30, 2024

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై ట్రైబ్యునల్‌ విచారణ

తప్పక చదవండి
  • కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌పై అధ్యయనం
  • అధ్యయనానికి సమయం ఇవ్వాలన్న ఏపీ
  • అభ్యంతరం చెప్పిన తెలంగాణ సర్కార్..
  • ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణ వాయిదా
  • నవంబర్‌ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఆదేశం
  • నవంబర్‌ 22, 23కు విచారణ వాయిదావేసిన ట్రైబ్యునల్‌..

న్యూ ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలపై చర్చించాలని ఇటీవల కేంద్రం కోరడంతో.. ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ జలాల పంపిణీపై ఈనెల 6న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై.. అధ్యయనం చేయాల్సి ఉందని.. విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. నోటిఫికేషన్‌ పూర్తి అధ్యయనానికి సమయం ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేసింది ట్రైబ్యునల్‌.. నవంబర్‌ 15 లోపు అభిప్రాయం చెప్పాలని ఏపీకి ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 22, 23 తేదీల్లో ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టనుంది. కాగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేల్చే పనిని కృష్ణా ట్రిబ్యునల్‌-2 కు కేంద్రం అప్పగించింది. అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 లోని సెక్షన్‌ 5(1) కింద కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్‌ కి విధి విధానాలను ఖరారు చేస్తూ.. కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. తద్వారా ఈ ట్రిబ్యునల్‌ చట్టపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులను అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956 సెక్షన్‌ (3)కు లోబడి పరిష్కరించాల్సి ఉంటుంది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఈ ట్రిబ్యునల్‌ కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొంది గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయిన నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్‌-2 పని ప్రారంభించింది. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా కృష్ణా ట్రిబ్యునల్‌-2కు అనదపు బాధ్యతలు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పుబడుతోంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వాటా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వాటాలు తేల్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్‌2కు విధివిధానాలు ఖరారు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. నదీ జల వివాదాల చట్టం ప్రకారం బ్రిజేషన్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అధికారం లేదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, విభజన చట్టం సెక్షన్‌ 89(ఏ) 89(బీ) కింద ట్రిబ్యునల్‌ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం పరిశీలనలో ఉందని గుర్తుచేసింది. ఇప్పుడు కొత్త అంశాలు చేర్చి వాటాలు పంచాలని సూచించడం తగదని అభ్యంతరం తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్‌-2కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కృష్ణా ట్రిబ్యునల్‌ – 2ను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956 సెక్షన్‌ 3 ప్రకారం 2004 ఏప్రిల్‌ 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నీటి వాటాలను ఖరారు చేస్తూ ఈ ట్రిబ్యునల్‌ అవార్డును ప్రకటించింది. అయితే 2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్‌ 89 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వాటాలు, వివాదాలను పరిష్కరించడం కోసం కృష్ణా ట్రిబ్యునల్‌-2 పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. తదనంతర కాలంలో ఈ వివాదాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో ట్రిబ్యునల్‌ ద్వారా వాటాలు తేల్చే పని సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్‌ ద్వారా జలవివాదాలను పరిష్కరించేలా చేస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన 2వ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.ఆ మేరకు 2021లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ వెనక్కి తీసుకోగా.. ప్రస్తుత కృష్ణా ట్రిబ్యునల్‌-2ను రద్దు చేసి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలా లేక కృష్ణా ట్రిబ్యునల్‌-2కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తే సరిపోతుందా అన్న అంశంపై మల్లగుల్లాలు పడ్డ కేంద్ర ప్రభుత్వం చివరకు న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. న్యాయశాఖ నుంచి వచ్చిన సూచనలు, సిఫార్సుల మేరకు కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్‌-2కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వాటాలను తేల్చే బాధ్యత అప్పగించింది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిపిన కేటాయింపులపైనే అభ్యంతరాలున్నాయి. ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నాయి. మొత్తంగా కృష్ణా నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటాలను తేల్చేందుకు కొత్తగా మరో ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి, ప్రస్తుత నీటి లభ్యత గణాంకాల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చాలన్న డిమాండ్‌ కూడా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు