- ఆప్ ఎంపీ సంజయ్సింగ్ అరెస్ట్
- తెల్లవారుజాము నుంచి సోదాలు చేసిన ఈడీ
న్యూఢిల్లీ : ఆప్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆయన నివాసంలో సోదాలు జరిపిన ఈడీ అధికారులు సంజయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. ఈ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఆయన పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని కోరినా న్యాయస్థానాలు ఆ అప్పీళ్లను తిరస్కరించాయి. దీంతో ఆయన దాదాపు 8 నెలలుగా జైలులోనే ఉంటున్నారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఒక పాలసీని ప్రవేశపెట్టింది. అందులో అవకతవకలు ఉన్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని విచారణ జరపడం, అరెస్ట్ చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ను ఈ ఏడాది ఏప్రిల్లో 9 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.