- వారిది ఫెవికాల్ బంధం
- బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు
- మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్ : బీఆర్ఎస్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదిరించుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్లో మోదీ మాటల్లో తెలిసింది బీఆర్ఎస్ బీజేపీకి ఉన్న సంబంధం అని వారి వ్యాఖ్యలను గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని కేసీఆర్ మోదీని కోరారంటూ ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్కు కేసీఆర్ డబ్బు పంపించారని మోదీ ఆరోపించారని.. మరీ ఆ సమాచారం ఉంటే కేసీఆర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ను గెలిపించేందుకు మోదీ తెలంగాణ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన అక్రమ సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారనన్నా ఆయన.. బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీని భాగస్వామిని చేశారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రహస్య స్నేహాన్ని మోదీ నిజామాబాద్లో బయటపెట్టారని తెలిపారు. మోదీ మాటల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్ఎస్తో దోస్తానా చేస్తుందా.. దానికి వారు సమాధానం చెప్పాలంటూ ధ్వజమెత్తారు. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. నీళ్లు అంటే కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి.. నిధులు అంటే కాళేశ్వరం అవినీతి గుర్తుకు వస్తుందని.. నియామకాలు అంటే కేటీఆర్కు సీఎం సీటు గుర్తొస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ధరణి దోపిడీ, ఔటర్, హైదరాబాద్ భూముల అమ్మకంపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలంటా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు-9, బీజేపీకి-7, ఎంఐఎం-1 చొప్పున ఎంపీ సీట్ల ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయన్న రేవంత్ రెడ్డి.. మంగళవారం నిజామాబాద్ సభలో మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.