- హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఎల్`టీ మైండ్ ట్రీ భారీగా లాస్.. !
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా ఫైనాన్సియల్ సర్వీసుల సంస్థల స్టాక్స్ పతనం, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ వంటి సంస్థల బలహీన ఆర్థిక ఫలితాలతోపాటు అమెరికా యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తాయన్న అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచాయి.
ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 314 పాయింట్లు (0.44 శాతం) నష్టంతో 71,187 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు (0.51 శాతం) పతనంతో 21,462 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60,033 కోట్లు నష్టపోయి రూ.369.75 లక్షల కోట్ల వద్ద స్థిర పడిరది. బీఎస్ఈలో 1906 స్టాక్స్ పతనం కాగా, 1898 స్టాక్స్ లాభంతో ముగిస్తే, 106 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఒకశాతం నష్టపోగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్క్రిప్ట్ మూడు శాతం నష్టంతో ముగిసింది. బుధవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ ఎనిమిది శాతానికి పైగా నష్టపోయింది. ఐటీ ఇండెక్స్ 0.6 శాతం పతనం కాగా, ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలు మిస్ కావడంతో ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ స్టాక్ 10.7 శాతం నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పీసీలో 3.5 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించడంతో ఆ సంస్థ స్టాక్ 3.15 శాతం పతనమైంది. వచ్చే రెండేండ్లలో ముడి చమురుకు మంచి డిమాండ్ ఉంటుందన్న ‘ఒపెక్’ కూటమి అంచనా నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 33 సెంట్లు పెరిగి 78.19 డాలర్లు పలికితే, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 47 సెంట్లు పుంజుకుని 72.94 డాలర్ల వద్ద స్థిర పడిరది. బీఎస్ఈలో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్ట్లే ఇండియా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.5 శాతానికి పైగా నష్టపోతే, స్మ్లా క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం స్వల్ప లాభంతో ముగిసింది.