- ఎన్నికల వేళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
- దేవుడిపై భారం వేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు
- భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్రెడ్డి
- బిర్లా టెంపుల్ సందర్శించిన హస్తం నేతలు
- గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : గురువారం ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలు ఆలయాల బాట పట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించు కోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు.
ఈ మేరకు బుధవారం ఆయన హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, తెలంగాణలో గురువారం ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ప్రజలెవరూ డబ్బులు సహా ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత, ప్రజాస్వామ్యయుత రాష్ట్రంగా వెల్లివిరియాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడిరచారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిర్లా టెంపుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవితో పాటు పలువురు కీలక నేతలు ఈ పూజల్లో పాల్గొన్నారు.
వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు. తర్వాత నాంపల్లి దర్గాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన తరపున ఎన్నికల బాధ్యతలను ఆయన సోదరులు చూసుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్గా ఆయన రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థులకు వచ్చే సమస్యలు.. అధికార పార్టీ నుంచి వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు గాంధీభవన్లో ఓ ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేశారు.
రేవంత్ రెడ్డి కూడా అభ్యర్థులకు అందుబాటులో ఉంటున్నారు ఎలాంటి అవసరం వచ్చినా తక్షణం స్పందిస్తున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణదీక్ష ప్రారంభించిన తేదీ సందర్భంగా దీక్షా దివస్ను బీఆర్ఎస్ నేతలు నిర్వహిచంకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా బయట ఎక్కడా కార్యక్రమాలను నిర్వహించలేదు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ రక్తదానం చేశారు.