- ప్రాక్టీస్ షురూ..
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి కారణం తెలియరాకపోయినా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ మాత్రం ఉన్నఫళంగా భారత్కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే తొలి టెస్టు నాటికి అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అందుకు అనుగుణంగానే కోహ్లీ కూడా.. నేడు టీమిండియాతో కలిశాడు. సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత తొలిసారి బరిలోకి దిగబోతున్న రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్లు నెట్స్లో శ్రమిస్తున్నారు. ఆదివారం వారికి కోహ్లీ కూడా జతకలిశాడు. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక బాక్సింగ్ డే టెస్టుగా జరుగబోయే తొలి టెస్టు ఈనెల 26 నుంచి మొదలుకానుంది. ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుంది..? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్లూ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పేసర్లుగా ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్లలో ఎవరికి ఛాన్స్ దక్కొచ్చు..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.