- తెలంగాణ జెన్ కో జేపిఏ నియామకాల్లో భారీ అక్రమాలు పార్ట్ – 2
- ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు మీడియం సర్టిఫికేట్లు
- ముడుపులు తీసుకొని ఉద్యోగాలు కేటాయించిన అధికారులు
- నకిలీ డిప్లోమా సర్టిఫికేట్లతో సబ్ ఇంజనీర్ లుగా ప్రమోషన్
- ఫిర్యాదు చేసిన బాధితులపై నానారకాలుగా బెదిరింపులు
- నకిలీ సర్టిఫకేట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న అర్హులైన అభ్యర్థులు
త్రవ్విన కొద్ది కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కెటిపిపి) చెల్పూర్, వరంగల్ భూపాలపల్లి జిల్లా నుండి వెన్నులో వణుకు పుట్టించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అనర్హులైన స్థానికేతరులు అనగా ఉమ్మడి ఖమ్మం, నల్లొండ జిల్లా అభ్యర్థులు స్థానికులుగా నకిలీ దృవపత్రాలు సృష్టించి, ఉద్యోగాలను ఎలా పొందారో సోమవారం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే.
స్థానిక నకిలీ దృవప్రతములు సమర్పించిన అభ్యర్థులు 10వ తరగతి మరియు ఐటిఐ సర్టిఫికేట్స్ పూర్వపు ఖమ్మం జిల్లాలో కలవు. అవి బోర్డు పరీక్షలు కనుక వాటిని మార్చటం కుదరదు. కనుకనే 9వ తరగతి వరకు పూర్వపు వరంగల్ జిల్లా నుండి దృవప్రతాలు పొందారు. ముఖ్యంగా జంగేడ్, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, డోర్నకల్లు నుండి నకిలీ దృవపత్రాలు పొంది, తదనుగుణంగా స్థానికత సర్టిఫికేట్ తీసుకొన్నారు. కొంతమంది అభ్యర్థుల 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఉత్తీర్ణత అయినట్టు ఉన్నప్పటికీ, 9వ తరగతి వరకు తెలుగు మీడియం చదివినట్లు సర్టిఫికేట్ పెట్టారు. ఉదాహరణకు జి. లక్ష్మన్న, బుద్ది సతీష్ కుమార్ లు పాల్వంచలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం స్కూల్లో పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివి, 1 నుండి 9వ తరగతి వరకు పూర్వపు వరంగల్ జిల్లాలో తెలుగు మీడియం చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. అదేవిధంగా జి.ఎస్. కనకరాజు, కె. రవి ప్రకాశ్, కురపాటి ఉదయ భాస్కర్, ఎస్. విష్టు కుమార్, బోయిన శ్రీనివాస్, టి. భగవాన్, ఎల్. శివకుమార్, బర్ల సుమన్, పి. సత్యనారాయణ లు ఫేక్ స్థానికత సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారు.
కనీస విచక్షణ లేకుండా అధికారులు అందినకాడికి ముడుపులు తీసుకొని, స్థానిక అభ్యర్థులకు మోసం చేసి, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంపై అర్హులైన అభ్యర్థులు మండిపడుతున్నారు.. అవినీతికి పాల్పడి అక్రమంగా అనర్హులకు ఉద్యోగాలు కల్పించిన అధికారులు బాధితులను నానారకాలుగా బెదిరించి నోరు మూయిస్తున్నారు.
నకిలీ పత్రాలతో స్థానిక కోటాలో ఉద్యోగం సాధించిన ఇంకొందరు డిప్లొమా సర్టిఫికెట్లు కొనుక్కొని, దాని ద్వారా సబ్ ఇంజనీర్ లుగా ప్రమోషన్ తీసుకొని దర్జాగా ఉద్యోగం చేస్తున్నారు. నిజంగా ఆ డిప్లొమా లు గురించి లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. నిజానికి స్థానికంగా ఉండి ఉద్యోగాలు కొల్పొయిన కొందరు యూత్ ఫోరం ఫర్ డిమెక్రటీ రైట్స్ (వైఎఫ్డిఆర్) హైదరాబాద్ను సంప్రదించి దీనిపై న్యాయ స్థానమును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. అవసరమయితే వైఎఫ్డిఆర్ వారు విద్యుత్త్ అధికారులను ప్రతివాదులుగా చేర్చుతున్నట్లు సమాచారం.
ఆదాబ్ హైదరాబాద్లో కథనం ప్రచురితమైన తరువాత టిఎస్ జెన్ కో అధికారులు కెటిపిపి చెల్పూరు సీఈ సిద్దయ్యను వెంటనే స్థానికంగా ఉద్యోగాలు సాధించిన వారి యొక్క అన్ని విద్యార్హత దృవ పత్రాలు తీసుకొని కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అక్రమ నియమాకాలపై పూర్తిగా దర్యాప్తు చేసి, అర్హులైన అభ్యర్థలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.