- ఇన్స్టంట్ బ్యాంక్ లోన్ పేరుతో స్కెచ్
- రూ. 90,000 కొట్టేసిన స్కామర్లు
ముంబై : టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల నవీ ముంబైకి చెందిన 56 ఏండ్ల వ్యక్తి నుంచి ఇన్స్టంట్ లోన్ ఇస్తామని మభ్యపెడుతూ ఆన్లైన్ నేరగాళ్లు రూ. 90,000 దండుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెండు గంటల్లో ఇన్స్టంట్ లోన్స్ ఆఫర్ చేస్తామనే పోస్ట్ను ఫేస్బుక్లో చూశాడు. తన కూతురు విద్యాభ్యాసానికి రుణం కోసం అన్వేషిస్తుండగా ఫేస్బుక్ పోస్ట్ అతడి దృష్టిని ఆకర్షించింది. పోస్ట్లో పేర్కొన్న ఫైనాన్స్ కంపెనీకి ఆన్లైన్లో రుణం కోసం నవంబర్ 8న అప్లై చేశాడు. కంపెనీ ప్రతినిధిగా పేర్కొంటూ అతడికి కొద్దిసేపటికే ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తనకు రుణం అందిస్తామని, అయితే ఇన్సూరెన్స్ చార్జీలు, జీఎస్టీ, ఎన్ఓసీ చార్జీలు, ఆర్బీఐ చార్జీల కింద కొంత మొత్తం చెల్లించాలని, రెండు ఇన్స్టాల్మెంట్స్ను ముందస్తుగా చెల్లించాలని కోరాడు.ఈ మొత్తం దాదాపు రూ. 90,000ను బాధితుడు చెల్లించాడు. ఆపై ఎంతకీ బాధితుడికి రుణ మొత్తం అందలేదు. కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా మరికొంత చెల్లించాలని కోరడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్ఫేక్ టెక్నాలజీతో స్నేహితుడి వలే వీడియో కాల్ చేసి, తనకు కొంత డబ్బు అవసరం ఉందని, వెంటనే పంపాలని కోరాడు. అయితే ఈ కాల్ నిజమని నమ్మిన ఓ వ్యక్తి రూ.40 వేల రూపాయలు పొగొట్టుకున్నాడు. ఈ తాజా ఘటనలో డీప్ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో కోల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ రాధాకృష్ణన్ను మోసం చేశారు. డీప్ఫేక్ టెక్నాలజీ ఆధారంగా వీడియో కాల్ చేసి, తన సోదరికి ఆపరేషన్ జరుగుతోందని అత్యవసరంగా రూ.40 వేల కావాలని కోరాడు. తొలుత రాధాకృష్ణన్ కొంత అనుమానం వ్యక్తం చేసినా… వీడియో కాల్ చేయడంతో అనుమానం నివృత్తి అయింది. దీంతో వెంటనే గూగుల్ పే ద్వారా రూ.40 వేల నగదును బదిలీ చేశాడు. అయితే మరో 35 రూపాయలు కావాలని మరోసారి ఫోన్ చేయగా.. రాధాకృష్ణన్కు అనుమానం వచ్చింది. దీంతో తన వద్దనున్న వేణుకుమార్ ఫోన్ నంబర్కు కాల్ చేశారు. దీంతో ఇదంతా మోసంగా తెలుసుకున్న రాధాకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 4 నెలల విచారణ అనంతరం కోజికొడ్ పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.