- అనుమతులు లేవు.. అడిగేవారే లేరు..
- లంచాలకు మరిగిన జీ.హెచ్.ఎం.సి.టౌన్ ప్లానింగ్ విభాగం..
- గతంలో నిర్మాణ పనులు ఆపేసినా.. తిరిగి ప్రారంభించిన బిల్డర్..
- అవినీతితో అంటగాగుతున్నఅధికారులు..
- డబ్బులు పడేసి దర్జాగా పనులు కానిస్తున్న వైనం..
- సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్న స్థానికులు..
హైదరాబాద్ : ఇటీవల కాలంలో శేరిలింగం పల్లి సర్కిల్ వార్తల్లో నిలుస్తోంది.. అక్రమ నిర్మాణాలకు అడ్రస్ గా మారిపోతోంది.. అక్రమార్కులతో నిస్సిగ్గుగా చేతులు కలుపుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు.. తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. అక్రమ నిర్మాణదారులతో నిస్సిగ్గుగా చేతులు కలుపుతుండటం కలకలం రేపుతోంది.. తాజాగా ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది.. వివరాలు చూస్తే.. హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం మాదాపూర్.. ఇలాంటి ప్రదేశంలో పేరొందిన ఐసీఐసీఐ బ్యాంకు పక్కన.. ఏ విధమైన నిర్మాణ అనుమతులు తీసుకోకుండా భారీ అక్రమ నిర్మాణం చేపట్టారు ఒక బిల్డర్.. కానీ ప్రేక్షకపాత్రలో మిగిలిపోయిన జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమ వంతుగా వారికి సహాయ సహకారాలు అందిస్తుండటం అత్యంత శోచనీయం..
విధులకు తిలోదకాలు ఇచ్చిన జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు.. కాగా ఇదే నిర్మాణానికి గతంలో అదే టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని పనులు ఆపేశారు.. కానీ ఏమి జరిగిందో తెలియదు కానీ, తిరిగి పంజా విప్పిన సదరు నిర్మాణ సంస్థ యాజమాన్యం కొందరు అవినీతి అధికారులతో లోపాయికారి ఒప్పొందం కుదుర్చుకుని.. జోరుగా తమ అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.. ఈ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు ఆపడానికి టౌన్ ప్లానింగ్ అధికారుల ఎందుకు జంకుతున్నారు..? వారి మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి..? ఎన్ని లక్షలు చేతులు మారాయి అన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.. ఈ అక్రమ వ్యవహారం వెనుక దాగివున్న అసలు వాస్తవాలు ఏమిటి అన్న విషయాలపై పూర్తి ఆధారాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..