- దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడులు..
అంతర్జాతీయంగా ఒడిదొడుకులు.. జాతీయంగా సానుకూల పరిస్థితులతో 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు పైపైకి దూసుకెళ్లాయి. నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరినా.. డిసెంబర్ లో పరిస్థితి రివర్స్ అయింది. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధుల వరద పోటెత్తింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.66,135 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. వీటితోపాటు డెట్, హైబ్రీడ్-వీఆర్ఆర్, ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో డిసెంబర్ 29 నాటికి ఎఫ్పీఐల నికర పెట్టబుడులు రూ.84,537 కోట్లకు చేరుకున్నాయి. ఎఫ్పీఐలు దేశీయ మార్కెట్లలో ఫైనాన్సియల్ సర్వీసెస్ స్టాక్స్ భారీగా కొనుగోలు చేశారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతోపాటు డెట్, హైబ్రీడ్, డెట్ -వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. యూఎస్ బాండ్ల విలువ పెరగడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.83,422 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రూ.39 వేల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్పీఐలు.. నవంబర్ నెలలో రూ.9000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. జనవరి, ఫిబ్రవరి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటే మే, జూన్, జూలై నెలల్లో ప్రతి నెలా రూ.43,800 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.