- ఢంకా భజాయించి చెబుతున్నా
- తొమ్మిదేళ్లుగా అధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి
- విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది
- రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- బిజెపి అధికారంలోకి వస్తే బిసి సిఎం
- నీళ్లు,నియామకాలపై మోసం చేసిన బిఆర్ఎస్
- బిఆర్ఎస్, కాంగ్రెస్ నాణానికి బొమ్మాబొరుసు
- లిక్కర్ అవినీతిలో ఎవరినీ వదిలి పెట్టేది లేదు
- పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం
- హైదరాబాద్ బిసి సభలో మోడీ పిలుపు
హైదరాబాద్ :హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామివారిని పీఎం స్మరించుకున్నారు. నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోడీ.. ‘మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు’ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీపైనే విశ్వాసంతో ఉన్నారన్న ఆయన.. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారని సీఎం కేసీఆర్?ను ఉద్దేశించి మోడీ ధ్వజమెత్తారు. ఆ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్న మోడీ.. ఆ మూడిరటి విషయంలో బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని.. స్వరాష్ట్రంలో బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్ అని ఆరోపించారు. రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షణాలని ఆక్షేపించారు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేనని మోడీ స్పష్టం చేశారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తమ పార్టీనే అని తెలిపారు. అబ్దుల్ కలామ్, రామ్నాథ్ కోవింద్, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘటన భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ఈ క్రమంలోనే ఓబీసీని అయిన తనను ప్రధానిని చేసింది, ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీ అని చెప్పారు. బీసీ యువత కోసం బీఆర్?ఎస్ పార్టీ ఏమీ చేయట్లేదని.. వారికి రూ.లక్ష ఇస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని మోడీ మండిపడ్డారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం తథ్యమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు. తెలంగాణ యువతను కేసీఆర్ సర్కారు మోసం చేసిందన్న మోడీ.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ.. యువత జీవితాలను దుర్భరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను ఇంటికి పంపాలా.. వద్దా? అని ప్రశ్నించిన ప్రధాని.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని.. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అని స్పష్టం చేశారు. సకల జనుల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, 4 కోట్ల మంది పోరాటం చేస్తేనే తెలంగాణా వచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే నీరు-నిధులు-నియామకాలు అందరికీ అందుతున్నాయా అనేదే ఇక్కడ ప్రశ్న అని అభిప్రాయపడ్డారాయన. తెలంగాణలో మోడీ ఆధ్వర్యంలో బీసీ అధికారం సాకారం కావాలన్నారు పవన్ కళ్యాణ్. నోటితో చెప్పడం తేలికేనని.. చేయడం కష్టమని.. బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆ ప్రకటనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందన్నారు పవన్. ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2004-14 వరకు ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ మోడీ వచ్చినప్పటి నుంచి వాటిని కంట్రోల్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 30 ఏండ్లల్లో లేని అభివృద్ధి.. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏండ్లలో జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే కాదు.. ప్రతీ భారతీయుడి గుండెల్లో మోడీ ధైర్యం నింపారని కొనియాడారు. ‘మోడీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ రద్దు చేసే వారు కాదు.. ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. ఆయన అద్భుతమైన విజనరీ లీడర్. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచం మొత్తం మనల్ని ప్రశంసిస్తోంది’ అని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ ప్రోత్సాహంతోనే చంద్రయాన్ 3 విజయం సాధించిందని చెప్పారు. దేశంలో మరోసారి మోడీ అధికారంలోకి రావాలంటూ ‘ఔర్ ఏక్ బార్ మోడీజీ’ అని పవన్ కళ్యాణ్ నినదించారు.