- రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ హెచ్చరిక
- నేరచరిత్రగల రౌడీ షీటర్లలో మార్పు కోసం రాచకొండ పోలీసు వారి ‘‘కౌన్సిలింగ్’’
- నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం..
ఎల్బీనగర్ : ఆదివారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేరచరిత్రగల రౌడీషీటర్లలో మార్పుకోసం ఎల్బీనగర్ లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ ప్రసంగిస్తూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేరములు వీడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరాన్ని చెప్పారు. నేరస్తులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరైన రౌడీ షీటర్స్ తన పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు. రౌడీషీట్ ఉన్నటు వంటి వారు న్యూ ఇయర్ సందర్భంగా తమలో మార్పు తెచ్చుకొని నేర ప్రవృత్తిని మార్చుకుని సమాజంలో కలవాలని,సాధారణ పౌరుల్లాగా నూతన జీవితం ప్రారంభించాలని సూచించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎదుగుతారని, అందుకని రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వదలి పిల్లలు మంచిగా ఎదగేలా, హుందాగా జీవించేలా, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేసుకునేలా బాధ్యత వహించాలని అన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్ అవుతున్నారని, పోలీస్ ఆఫీసర్ పిల్లలు పోలీస్ ఆఫీసర్లు అవుతున్నాని,రౌడీ షీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామని, పోలీసులు రౌడీ షీటర్ల నుండి కోరుకునేది మార్పు మాత్రమే అని మీ చుట్టు జరిగే నేరాలపై సమాచారం అందించి మాకు సహకరించే వారికి, మార్పు వచ్చిన వారికి పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు. రౌడీ షీట్ రికార్డ్ లో వారు చేసే మంచి పని కూడా ఎంటర్ చేస్తామని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు.గతాన్ని మరచిపోయి మారిన మనసుతో ముందడుగు వేయాలని, అందులో వారి కుటుంబ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జైలులో గడిపే వారికంటే నేరాలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా ఉండే వారికి కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైన రౌడీ షీటర్లు పోలీస్ శాఖ వారు తమలో మార్పు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేసినారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసిపి జానకి ధారావత్ ఐపీఎస్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఎస్ఓటి డీసీపీ -1 గిరిధర్ రావుల ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ఐపిఎస్, ఎస్ఓటి డిసిపి మురళీధర్, ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ తదితరులు పాల్గొన్నారు.