- కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలపై ఆసక్తి
- 4రోజుల పాటు సమావేశాలు.. అసెంబ్లీకి రానన్న రాజాసింగ్ ..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణలో పరిపాలన పరమైన కార్యక్రమాలు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తైంది. ఇది జరిగిన 24గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం కూడా శనివారం జరగనుంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ హోదాలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. అంతే కాదు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. హైకమాండ్ ఆయన్ని సభాపతిగా కొనసాగాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అయితే రేపటి నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరువతారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్జరీ కారణంగా సభకు హాజరుకాలేరని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి మొదలవుతున్నాయి.ఫస్ట్ సెషన్ కి ముందు నూతనంగా అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. కొత్త ఎమ్మెల్యేలతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ హోదాలో ప్రమాణం చేయిస్తారు. అయితే శనివారం జరిగే శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గైర్హాజరు కానున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తున్నందునే ఆయన ప్రమాణస్వీకారం చేయనని స్పష్టంగా చెప్పడం జరిగింది. శాసనసభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. డిప్యుటీ స్పీకర్ గా ఎవరు ఉంటారు అనే దానిపై ఇంకా ప్రకటన రాలేదు. సభను సజావుగా నడిపించడంలో అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా హుందాగా సమావేశాల్ని నిర్వహిస్తానని గడ్డం ప్రసాద్ తెలిపారు.