Sunday, April 28, 2024

అమెరికా సైతం మన టెక్నాలజీ కావాలనుకుంటోంది..

తప్పక చదవండి
  • కీలక వ్యాఖ్యలు చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్..
  • చంద్రయాన్ సక్సెస్ తో ప్రపంచం దృష్టి భారత్ పైనే..
  • భారత్ కూడా సాంకేతికతను ద్విగుణీకృతం చేసుకోగలుగుతోంది..
  • అంతరిక్ష రంగంలో ప్రైవేట్ అవకాశం కల్పిచిన మోడీ..
  • విద్యార్థులు కాలానికి అనుగుణంగా మారాలి : సోమనాథ్..

బెంగుళూరు : చంద్రయాన్ సక్సెస్ తో యావత్ ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని తనవైపు తిప్పుకుంది ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను సాధిస్తూ అంతరిక్షం పరిశోధనలో వేగంగా అడుగులు వేస్తున్న మన శాస్త్రజ్ఞుల కృషి, పట్టుదల.. తెలివి తేటల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్‌ 3 సక్సెస్ తో భారత్ స్థాయి పెరిగిపోయిందన్నారు. అమెరికా సైతం మన టెక్నాలజీని తెలుసుకునే పనిలో పడిందన్నారు. చంద్రయాన్ 3 విజయంతో స్పేస్ రంగంలో భారత టెక్నాలజీ మరో లెవల్‌కు వెళ్లింది. ఇదే అంతర్జాతీయంగా భారత దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. దీంతో భారత్‌ టెక్నాలజీని దక్కించుకునేందుకు అమెరికా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత అమెరికా స్పేస్ నిపుణులు.. భారత టెక్నాలజీని అడిగారని చెప్పారు ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్. అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను ఆ దేశంతో పంచుకోవాలని చంద్రయాన్ 3 విజయానికి ముందే కోరినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్‌ సోమనాథ్‌ స్పష్టం చేశారు. భారత్ ఒకప్పటిలాగా లేదని.. ప్రస్తుతం కాలం మారిందని.. భారత్‌ కూడా అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని తేల్చి చెప్పామన్నారు.

అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు అవకాశాలు కల్పించారని సోమ్‌నాథ్ చెప్పారు. తమిళనాడులోని చెన్నైలో డా.ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్‌ ఈవ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 వ్యోమనౌకను తయారు చేసిన తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఎక్స్‌పర్ట్స్‌ను ఇస్రో ఆహ్వానించినట్లు సోమ్‌నాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా నాసా నిపుణులకు వివరించినట్లు చెప్పారు.

- Advertisement -

అంతేకాదు భారత దేశంలో శాస్త్రీయ పరికరాలు నాణ్యతతో ఉంటాయి.. చాలా చౌకగా లభిస్తాయి. వాటితో నిర్మాణాలను చేయడం చాలా సులభం.. అది సాంకేతికతతో తయారు చేసినవి కనుక మీరు తయారు చేసే పరికరాలను అమెరికాకు ఎందుకు అమ్మకూడదు’ అని నాసా వారు అడిగినట్లు సోమనాథ్ చెప్పారు.

అందుకనే విద్యార్థులు మారిన కాలాన్ని అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా కెరీర్ ను ఎంచుకుని అత్యుత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. మన స్వదేశీ ఉత్పత్తులతోనే అత్యుత్తమ పరికరాలు, అత్యుత్తమ రాకెట్‌లను తయారు చేయగలమని పేర్కొన్నారు.

ఇస్రో వారు మాత్రమే కాదు ఇతరులు కూడా రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్ష సాంకేతికతలో మన దేశాన్ని మరింత శక్తివంతం చేయాలని తాము ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చెబుతున్నామన్నారు. ఇందుకు ఉదాహరణ చెన్నై అగ్నికుల్ అనే సంస్థ రాకెట్లను తయారు చేస్తుంది. అంతేకాదు హైదరాబాద్‌లో స్కైరూట్ కూడా అంతరిక్ష సాంకేతిక పరికరాల తయారీలో ముందు ఉంది. భారతదేశంలో కనీసం ఐదు కంపెనీలు రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు