Friday, May 3, 2024

శ్రీవారి ఆలయంపై విమానం..

తప్పక చదవండి
  • మూడు నెలల వ్యవధిలో ఇది నాలుగో సారి..
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తజనం..
  • ఆగ మాగ మవుతున్న ఆగమ శాస్త్రం..
  • ఇది దోషం అంటున్న పండిత గణం..
  • తిరుమల నో ఫ్లై జోన్ కాదంటున్న ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు..

తిరుమల : దేవ దేవుని లిప్తపాటు దర్శనం కోసం.. నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవింద నామ స్మరణతో.. కాలినడకన ఏడు కోండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే.. కోటిజన్మల పుణ్యఫలమని భావిస్తారు. అందుకే.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి.. ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మళ్లీ విమానం వెళ్లింది. ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. గురువారం మరోసారి తిరుమల కొండపై నుంచి విమానం వెళ్లింది. గత మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు విమానాలు తిరుమల శ్రీవారి దేవాలయం పైనుంచి వెళ్లడంపై.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం… వెంకటేశ్వర స్వామి వారికి పైనుంచి విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు వంటివి వెళ్ల కూడదనే నియమం ఉంది. అంతేకాదు.. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా భక్తుల్లో ఉంది. అలానే.. సైన్స్‌ ప్రకారం కూడా.. ఆ ప్రాంతంలో పాజిటివ్‌ రేస్‌ ఎక్కువగా ఉండటం వలన.. విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం కూడా ఉంది. బ్రిటీష్‌ వారి కాలంలో.. ఇలా రెండు విమానాలు.. ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆనంద నిలయ గోపురంపై విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తిరగడం నిషేధం అంటున్నారు పండితులు. తిరుమల శ్రీవారి ఆలయం మహిమాన్విత శక్తి అని.. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే.. తిరుమల క్షేత్ర పర్వతాలుగా భావిస్తారు భక్తులు. ఆలయంలో శ్రీవారు దివ్య శక్తితో ఉంటారని.. అలాంటి పవిత్రమైన ఆలయంపై విమానాలు ప్రయాణించడం దోషంగా చెబుతున్నారు పండితులు. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ… రేణిగుంట విమానాశ్రయం అధికారులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా… వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు.. తిరుమల నో ఫ్లై జోన్‌ కాదంటూ ఎయిర్‌ ట్రాఫికింగ్‌ అధికారులు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు