- ఓటు కోసం నానా తంటాలు
- మద్యంతో పాటు ప్యాకేజీలు
- ఓటుకు నోటు పంచుతున్న నేతలు
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారం ముగియడంతో గతరాత్రి నుంచి ప్లరోభాల పర్వానికి తెరలేచింది. పోలింగ్కు కొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రలోభ పర్చుకునే క్రమంలో పోటీచేస్తున్న అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మద్యంతో పాటు నోటను అప్పగించే ప్రక్రియలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల బాహాటంగానే సాగింది. ఇందుకోసం నేతలు భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి పంపిణీకి సిద్దంగా ఉంచారు. రహస్య ప్రాంతాల్లో డంప్ చేశారని తెలుస్తోంది. పోలింగ్ కు ఒకరోజు ముందుగా పంపిణీకి స్థానిక బూత్లెవల్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. తమను గెలిపించాలంటూ ఇన్నాళ్లూ పోటాపోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు.. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టారు. ఓటర్లకు నగదు, మద్యం పంచడం షురూ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పది రోజుల క్రితమే పంపకాలు మొదలుకాగా.. మంగళవారం రాత్రి నుంచి అన్ని నియోజకవర్గాల్లో జోరు పెంచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు నగదు పంపిణీ చేస్తుండగా, కొన్ని నియోజకవర్గాల్లో మిగతా పార్టీలకు దీటుగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బీజేపీ క్యాండిడేట్లు బిజీగా ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు సుమారు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజక వర్గాల్లోనూ ఓటర్లకు ఈసారి భారీగా ముట్టజెప్తున్నట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండగా.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అంతకుముందు గానే ప్లాన్ చేశారు. శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున లిక్కర్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఇకపోతే మటన్కు ఆర్డర్స్ చేశారు. నగరానికి సంబంధించి ఐటీ ఉద్యోగులు, యూత్ కు టూర్స్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తుండగా.. గెలిచాక కోరిన ప్రాంతాలకు తీసుకెళ్తామని హావిూలు ఇస్తున్నారు. ఐటీ, ప్రయివేట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ స్టూడెంట్లను గ్రూపులుగా చేసి టీమ్ లీడర్ను కూడా నియమించారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, నమ్మకమైన అనుచరులకు ఈ బాధ్యతలు అప్పగించారు. సిటీ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మందు పార్టీలకు ఓటర్లను తరలించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ను బుక్ చేశారు. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో రూమ్స్ బుక్ చేశారు. వాటి పేరుతో టోకెన్స్ ఇస్తుండగా.. ఒక్కో టీమ్లో నలుగురిని, వీరిని మానిటరింగ్ చేసేందుకు బూత్లెవెల్ లీడర్లకు బాధ్యతలు ఇచ్చారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 వేల వరకు వస్తాయని ఓటర్లు ఆశిస్తున్నారు. గ్రేటర్శివార్లలోని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులు రూ.5 వేలు ముట్టజెప్తున్నారు. ఏరియాలను బట్టి కొందరికి గిఫ్టులు కూడా ఇస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో పెద్ద ఎత్తున దావత్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత అని ఒక్కో ఓటరుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రత్యర్థులు పంచే మొత్తాన్ని బట్టి మరికొంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు ఇస్తున్నారని ప్రచారం జరగుఉతోంది. కామారెడ్డిలో ఓటుకు 25వేలు ఇస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.అన్ని చోట్ల మందుతో విందులు ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివార్లలో త్రిముఖ పోటీ ఉన్న సెగ్మెంట్లలో 3 పార్టీల అభ్యర్థులు కలిపి కేవలం ఓటర్లకే రూ.200 కోట్లకు పైగా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. కొన్ని చోట్ల మొదటి విడతగా రూ.2 వేల చొప్పున ఇచ్చిన లీడర్లు.. బుధవారం రాత్రి మరో విడతగా ఇస్తామని చెప్తున్నారు. ఓటర్లకు నగదు పంపిణీలో బీఆర్ఎస్ అభ్యర్థులే ముందున్నారు. బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల
పోటాపోటీగా ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది మంగళవారం రాత్రి నుంచే చెల్లింపులు మొదలు పెట్టారు. ఇన్నాళ్లు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే పోల్ మేనేజ్మెంట్ ఒక ఎత్తు అని చెప్తున్నారు. ప్రధాన పార్టీల హెడ్ క్వార్టర్స్ నుంచి పెద్దలు అభ్యర్థులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ వీక్?ఉన్నారు.. ఎంత పంపిణీ చేయాలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి నగదు తరలింపునకు ఆటంకాలు ఉండటంతో స్థానికంగానే డబ్బులు సర్దుబాటు చేస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లతో మాట్లాడి డబ్బు సర్దుబాటు చేయాలని, ఆ మొత్తానికి తాము గ్యారంటీ ఇస్తామని ఆయా పార్టీల ముఖ్యులు హావిూ ఇస్తున్నారు. నగదు పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యేకంగా కొన్ని బృందాలను పెట్టుకుని డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.