ఇది హృదయ విదారక ఘటన.. ఏడాదిన్నర క్రితమే ఆ జంటకు వివాహమైంది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్లిన భార్య.. ఇటీవలే పుట్టింటికి వచ్చింది. భార్య హైదరాబాద్లో ఉండగానే భర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో భర్త అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటలకే భార్య ఆత్మహత్య చేసుకుంది.
వనస్థలిపురం వాసి మనోజ్(31) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్. అమెరికాలో డల్లాస్లో స్థిరపడిన మనోజ్.. ఏడాదిన్నర క్రితం అంబర్పేట డీడీ కాలనీకి చెందిన సాహితీ(29)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే భార్యను తీసుకొని, మనోజ్ అమెరికా వెళ్లాడు. అయితే ఈ ఏడాది మే 2వ తేదీన తల్లిదండ్రులను చూసేందుకు సాహితీ హైదరాబాద్కు వచ్చింది. మే 20వ తేదీన మనోజ్ గుండెపోటుకు గురికాగా, స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న సాహితీ గుండెలవిసేలా రోదించింది. 23వ తేదీన రాత్రి మనోజ్ డెడ్ బాడీ వనస్థలిపురం చేరుకోగా, 24న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిశాక సాహితీ తన తల్లిదండ్రులతో కలిసి డీడీ కాలనీకి చేరుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె గురువారం ఉదయం 9:30 గంటలకు ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.