- టాయిలెట్లో లాక్ వేసుకున్న నిందితుడు అరెస్ట్
భోపాల్ : కదులుతున్న రైలులోని టాయిలెట్లో మహిళపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టాయిలెట్ లోపల లాక్ వేసుకున్నాడు. తప్పించుకున్న బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా రైలులోని టాయిలెట్ డోర్ను బద్ధలు కొట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఒక మహిళ జబల్పూర్-రేవా మధ్య నడిచే మెము రైలులో ప్రయాణించింది. పకారియా స్టేషన్ సమీపంలో ఆ మహిళ రైలులోని టాయిలెట్కు వెళ్లింది. ఆమెను అడ్డుకున్న ఒక వ్యక్తి టాయిలెట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు సత్నా స్టేషన్లో రైలు దిగింది. ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ అరుపులు విన్న కొందరు ప్రయాణికులు ఆ టాయిలెట్ వద్ద గుమిగూడారు. దీంతో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి టాయిలెట్ లోపల గడియ వేసుకుని ఉండిపోయాడు. ఆ రైలు రేవా స్టేషన్ చేరుకోగా జీఆర్పీ సిబ్బంది స్పందించారు. కంపార్ట్మెంట్లోని ఆ టాయిలెట్ వద్దకు వెళ్లి డోర్ను పగులగొట్టారు. అందులో దాగి ఉన్న 23 ఏళ్ల నిందితుడు పంకజ్ కుష్వాహను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బందాకు చెందిన అతడు మధ్యప్రదేశ్లోని కట్నీలో నివసిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం పరిధిలో నేరం జరుగడంతో కేసును అక్కడకు బదిలీ చేసినట్లు వెల్లడించారు.